వెంగళరావునగర్, మే 24 : మేడపై ఆడుకుంటున్న చిన్నారికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి మృత్యువుతో పోరాటం చేస్తున్నది. రహ్మత్ నగర్ డివిజన్ ఎన్ఎస్బీ నగర్లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్ఎస్బీనగర్ ప్రధాన రహదారి పక్కన రమేశ్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. మేడ పై హైటెన్షన్ తీగల కింద ఉన్న గదిలో జీహెచ్ఎంసీలో పనిచేసే యాకయ్య దంపతులు కొన్ని నెలల కిందట అద్దెకు దిగారు.
ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో నివాసముండే వీరి మనవడు, మనవరాలు వేసవి సెలవుల ఉన్నాయని ఇటీవల వచ్చారు. శుక్రవారం సాయంత్రం మెడ పై ఉన్న గది ముందు టేప్తో మనవరాలు మిల్కీ(8) ఆడుకుంటుండగా.. పైన అతి సమీపంలో ఉన్న హైటెన్షన్ తీగలు తగలడంతో విద్యుదఘాతానికి గురై శరీరం కాలి పోయింది. స్థానికులు దవాఖానకు తరలించగా, పాప పరిస్థతి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. మధురానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.