సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): నగర పౌరులకు సుపరిపాలన అందించేందుకు ఈ నెల 16న ఏర్పాటు చేస్తున్న వార్డు కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పారదర్శకంగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బంజారాహిల్స్ వార్డు కార్యాలయ సిబ్బంది అధికారులు, సర్కిల్ అధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రభుత్వం సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నందున వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. సమస్య పరిష్కారానికి సిటిజన్ చార్జర్ రూపొందించినందున ప్రతి సమస్యను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించి జీహెచ్ఎంసీలో బంజారాహిల్స్ వార్డును ఆదర్శంగా నిలుపాలని సూచించారు. ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి సమస్య పరిష్కారం దిశగా కృషి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ డీసీ రజనీకాంత్, ఏఎంసీ తదితరులు పాల్గొన్నారు.