సిటీబ్యూరో, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ) : ‘చికెన్ బిర్యానీ. ఈ వంటకానికి ఉన్న క్రేజ్ చెప్పనక్కర్లేదు. ఫ్రెండ్స్తో సరదాగా బయటకు వెళ్లినా.. ఫ్యామిలీతో కలిసి హోటల్కు వెళ్లినా.. హాలిడేని ఇంట్లో ఎంజాయ్ చేసినా.. చాలామంది ఆర్డర్ ఇచ్చేందుకు ఇష్టపడేది చికెన్ బిర్యానీనే. ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల నాన్వెజ్ వంటకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ చికెన్ బిర్యానీకి ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఆర్డర్ల పరంగా అదే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని తాజాగా స్విగ్గీ నిర్వహించిన సర్వేలో తేలింది. చికెన్ బిర్యానీ తర్వాత అత్యధిక మంది మసాలా దోశ ను ఇష్టపడుతున్నట్లు వెల్లడైంది.’
2022 సంవత్సరానికి ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లపై ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సర్వే నిర్వహించింది. ఈ మేరకు వార్షిక ట్రెండ్ నివేదికకు సంబంధించి 7వ ఎడిషన్ను విడుదల చేసింది. స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకాల్లో చికెన్ బిర్యానీ, మసాలా దోశ ఉన్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రతి సెకనుకు 2.28 బిర్యానీలు, నిమిషానికి 137 బిర్యానీ ఆర్డర్లు వస్తున్నాయట. చికెన్ బిర్యానీ తర్వాత మసాలా దోశ కు ప్రాధాన్యత ఇచ్చినట్లు స్విగ్గీ పేర్కొంది.
వీటి తర్వాత స్థానంలో చికెన్ ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, తందూరి చికెన్లకు ఆర్డర్లు ఉన్నట్లు తెలిపింది. విదేశీ వంటకాల్లో అత్యధికంగా ఇటాలియన్ పాస్తా, పిజ్జా, మెక్సికన్ బౌల్, స్పైసీ రామెన్, సుషీ వంటకాలకు చాలామంది ఫిదా అయ్యారట. అత్యధికంగా ఆర్డర్ చేసిన టాప్ 10 స్నాక్స్లో సమోసా, పాప్ కార్న్, పావ్ బాజ్జీ, ఫ్రెంచ్ ఫ్రైస్, గార్లిక్ బ్రెడ్ స్టిక్, హాట్ వింగ్స్, టాకో, క్లాసిక్ స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్, మింగిల్స్ బకెట్ ఉన్నాయని, స్వీట్లలో గులాబ్ జామ్, రస్మలై, చోకో లావా కేక్, రస్గుల్లా, చోకోచిప్స్ ఐస్ క్రీమ్, అల్ఫోన్సో మ్యాంగో ఐస్ క్రీమ్, కాజు కట్లీ, టెండర్ కొకోనట్ ఐస్ క్రీమ్, చాక్లెట్, హాట్ చాక్లెట్ ఫడ్జ్ ఆర్డర్లు ఉన్నట్లు స్విగ్గీ తన నివేదికలో వెల్లడించింది.