సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : కలుషిత నీరు, లీకేజీలు అరికట్టే ప్రక్రియలో అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని జలమండలి నిర్ణయించింది. ఈ మేరకు ‘క్విక్ ఇన్స్పెక్షన్ వాటర్ పొల్యూషన్ సిస్టం (క్యూఐడబ్ల్యూపీఎస్) అనే యంత్రం పనితీరుపై అధ్యయనం చేస్తున్నది. ప్రయోగాత్మకంగా ఈ యంత్రం పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఫలితాలను బట్టి త్వరలోనే ఈ యంత్రాన్ని కొనుగోలు చేసేందుకు జలమండలి సన్నద్ధమవుతుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
యంత్రం పనితీరు ఇలా..
క్విక్ ఇన్స్పెక్షన్ వాటర్ పొల్యూషన్ సిస్టం ద్వారా కలుషిత నీటి సరఫరా, లీకేజీలను త్వరగా గుర్తించే వీలు ఉంటుంది. బ్యాటరీతో నడిచే ఈ యంత్రానికి 120 మీటర్ల పొడవైన పైపు ఉంటుంది. దానికి లైట్తో కూడిన ఒక కెమెరా ఉంటుంది. పైన మానిటర్ ఉంటుంది. ఈ యంత్రం పైపునకు ఉన్న కెమెరాను సమస్య గుర్తించి సంబంధిత వాటర్ పైపులైన్/మ్యాన్హోల్లోకి పంపిస్తారు. ఈ యంత్రాన్ని ఆపరేట్ చేసే సిబ్బంది పైన మానిటర్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఎక్కడైనా సమస్యను గుర్తిస్తే..వెంటనే ఆయా సిబ్బందితో తగిన చర్యలు తీసుకుంటారు. దీనిని రిమోట్తో కూడా ఆపరేట్ చేయవచ్చు. వీడియో రికార్డు చేయడానికి అందులో మెమొరీ కార్డు సౌకర్యం కూడా ఉంది. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 3 నుంచి 4 గంటలు పడుతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 48 గంటల వరకు ఆగకుండా పనిచేస్తుంది.