దుండిగల్,ఫిబ్రవరి 9: సాంకేతిక నైపుణ్యానికి సామాజిక బాధ్యత తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని ఎంఎల్ఆర్ఐటీ కళాశాల నిరూపించింది. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన ప్రతిష్టాత్మక అన్వేషణ-2026 తెలంగాణ ప్రాంతీయ స్థాయి పోటీల్లో ఎంఎల్ఆర్ఐటీ ఈసీఈ విభాగం రోబోటిక్స్ క్లబ్.. ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో విద్యార్థులు ప్రదర్శించిన ‘బోర్బాట్ఎక్స్-బోర్వెల్ రెస్క్యూబాట్’అందరినీ ఆకట్టుకుంది.
పాడుబావిలో, బోరుబావుల్లో ప్రమాదవశత్తు పడిపోయే చిన్నారులను రక్షించడానికి ఈ రోబోను రూపొందించారు. 100 నుంచి 700 అడుగుల లోతులో, అత్యంత ఇరుకైన ప్రదేశాల్లో కూడా ఇది సమర్ధవంతంగా పని చేస్తుందని వివరించారు. వేగవంతంగా, సురక్షితమైన రెస్క్యూ ఆపరేషన్ల ద్వారా విలువైన ప్రాణాలను కాపాడటం కోసం ఇది చాలా అనువైనదిగా వివరించారు. ఈ విజయంతో విద్యార్థుల బృందం రూ.3 లక్షల నగదు బహుమతిని గెలుచుకుంది.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మార్గదర్శకత్వం..
ఎంఎల్ఆర్ఐటీ విద్యార్థులు హరికృష్ణ, గోకాని అభినయ గుండ్లపోచంపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు కే.సందీప్, పీ.దుర్గాప్రసాద్కు మార్గదర్శకత్వం వహించి ఈ ప్రాజెక్టును రూపొందించడం విశేషం. దీంతో ఫిబ్రవరి 11, 12 తేదీలలో బెంగళూరులో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఈ బృందం తెలంగాణ ప్రతినిధులుగా ఎంపికైంది. ఈ విజయంపై ఎంఎల్ఆర్ విద్యాసంస్ధల కోశాధికారి మర్రి మమతారెడ్డి, డైరెక్టర్ మర్రి అనుశ్రేయారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ రాధికాదేవి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను ప్రోత్సహించిన లక్ష్మణ్రెడ్డి, మర్రి ధీరెన్రెడ్డికు ధన్యవాదాలు తెలిపారు. ఈసీఈ విభాగాధిపతి డా.ఎస్వీఎస్ ప్రసాద్, అసిస్టెంట్ ఫ్రొఫెసర్ రాజునాయక్ పర్యవేక్షణలో ఈ ఘనత సాధించినట్లు యాజమాన్యం పేర్కొంది.
సామాజిక బాధ్యతతో చేపట్టడం గర్వకారణం
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ, సామాజిక బాధ్యతతో ఈ ప్రాజెక్ట్ను మా కళాశాల విద్యార్థులు చేపట్టడం గర్వకారణంగా ఉంది. విద్యార్థులు కేవలం ఇంజనీర్లుగా మాత్రమే కాకుండా ఆవిష్కర్తలుగా ఎదగేందకు ఎంఎల్ఆర్ఐటీ కళాశాల ఎల్లప్పుడూ కృషిచేస్తుంది. విద్యార్థులు జాతీయస్థాయిలోనూ రాణించాలి.
– మర్రి రాజశేఖర్రెడ్డి, కళాశాల వ్యవస్థాపక కార్యదర్శి, మల్కాజిగిరి ఎమ్మెల్యే