Recovery Agents | సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): అవసరాలను బట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్న సామాన్య ప్రజలపై కొన్ని సంస్థలు అధిక భారం వేస్తూ ప్రాణాలు తీసుకునే స్థాయికి తీసికెళ్తున్నాయి. లోన్ యాప్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు ఒకపక్క జరుగుతుండగా.. మరో పక్క తాజాగా.. బ్యాంకు రికవరీ ఏజెంట్ల ఒత్తిళ్లతోనూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా.. కీసరలో వెలుగులోకి వచ్చిన దంపతుల ఆత్మహత్య ఘటనతో రుణాల రికవరీలో వేధింపుల విషయం చర్చనీయాంశంగా మారింది. కొన్ని బ్యాంకులు వద్దన్నా క్రెడిట్ కార్డులు కట్టబెడుతుంటాయి. పర్సనల్ లోన్స్ ఇస్తుంటాయి. ప్రజల డేటా బేస్ మొత్తం ప్రైవేట్ ఏజెన్సీల చేతిలోకి వెళ్తుంది. ఈ వివరాలతో టెలి కాలర్స్ ప్రతి ఒక్కరినీ వేధిస్తూ లోన్ కావాలా..? క్రెడిట్ కార్డు కావాలా..? అంటూ వేధిస్తుంటారు.
అవసరం లేకున్నా మీకు ఈ అవకాశముందంటూ రుణాలు, క్రెడిట్ కార్డులు కట్టబెడుతూ ఆయా బ్యాంకులు తమ చేతులు దులుపుకొంటున్నాయి. ఆ తరువాత బిల్లులు, వడ్డీలకు వడ్డీలు వాయిస్తూ వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. క్రెడిట్ కార్డు బిల్లు నిర్ణీత సమయానికి చెల్లించకుంటే, మరుసటి రోజు నుంచే జరిమానా విధిస్తుంటారు. రకరకాల పేర్లతో ఇష్టానుసారంగా బిల్లులు వేసి.. కస్టమర్ల నుంచి బలవంతంగా వసూలు చేస్తుంటారు. ఒక్క నెల చెల్లించలేదంటే.. ఇక ఆ కస్టమర్పై బ్యాంకు కాల్ సెంటర్లు, ప్రైవేట్ ఏజెన్సీలు ఫోన్లు చేస్తూ దండయాత్ర చేస్తారు.
మరికొందరు ఒక అడుగు ముందుకేసి.. ఇండ్ల వద్దకు వెళ్లి అప్పు చెల్లిస్తావా..? లేదా..? అంటూ వేధింపులకు గురిచేస్తుంటారు. కీసరకు చెందిన రాగుల సురేశ్, భాగ్య దంపతులు రెండు బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నారు. రుణం చెల్లించాలంటూ రికవరీ ఏజెంట్లు చేసిన అవమానాన్ని భరించలేక శనివారం తనువు చాలించారు. రికవరీ ఏజెంట్ల వేధింపులతోనే తాము ఆత్మహత్య చేసుకున్నామని కీసరలో ఆత్మహత్య చేసుకున్న దంపతులు సూసైడ్ నోట్ రాయడంతో ఏమి జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.