అడ్డగుట్ట : ఒంటరిగా వెళ్తున్న వృద్ధురాలి మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి రెండున్నర తులాల పుస్తెలతాడును అపహరించుకొని పారిపోయిన ఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం..తుకారాంగేట్ సాయినగర్ ప్రాంతానికి చెందిన రాంబాయి అద్దె ఇంటి కోసం స్తానికంగా నందనార్ నగర్లోని సమోసా గార్డెన్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం 12.55 గంటల సమయంలో వెతుకుతున్నది.
ఈ క్రమంలో తన వెనుక నడుచుకుంటూ వచ్చిన ఓ దుండగుడు రాంబాయి మెడలోని పుస్తెల తాడును తెంపుకొని ద్విచక్రవాహనం (నలుపు రంగు యాక్టివా) పై పారిపోయాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులందరూ వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే దొంగ అక్కడి నుంచి పారిపోయాడు.
అనంతరం బాధితురాలు స్థానిక తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవి ఫుటేజ్ల ఆధారంగా దర్యాఫ్తు చేస్తున్నారు. అయితే నందనార్ నగర్ నుంచి బయటకి వచ్చిన చైన్స్నాచర్ అడ్డగుట్ట చౌరస్తా వైపు వెళ్లినట్లు తెలిసిందని సీఐ ఎల్లప్ప తెలిపారు.