సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు స్నాచర్లను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు కేసులకు సంబంధించి మొత్తం 16.3 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీపీ సజ్జనార్ కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా బొల్లారం వినాయకనగర్కు చెందిన పలా సంతోశ్ బాచుపల్లిలోని టీవీఎస్ టైర్ల గోడౌన్లో పనిచేస్తుంటాడు. ఇతడికి దేవరయాంజల్కు చెందిన టెంకంపేట్ కరుణాకర్ అలియాస్ కన్నా పరిచయం అయ్యాడు. ఇద్దరు స్నేహితులుగా మారి, విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డారు. చేసే పనిలో వచ్చే సంపాదన.. తమ విలాసాలకు సరిపోకపోవడంతో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని.. స్నాచింగ్లు చేయడం మొదలు పెట్టారు. నిర్మానుష్య ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్లే మహిళల మెడలో నుంచి బైక్పై వెళ్లి గొలుసులు లాక్కొని వెళ్తుంటారు. ఈ ఘటనలపై దుండిగల్, అల్వాల్, జగద్గిరిగుట్టతో పాటు సిద్దిపేటలోని గోవారం పీఎస్లోనూ కేసులు నమోదయ్యాయి. ఎస్ఓటీ డీసీపీ సందీప్ నేతృత్వంలోని బాలానగర్ జోన్ బృందం ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశారు.