Forest Lands | మేడ్చల్, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ): అటవీ భూములు దురాక్రమణకు గురి కాకుండా అటవీ శాఖ అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. అటవీ భూముల పరి రక్షణలో గొలుసు లింక్ ఫెన్సింగ్ ఏర్పాటుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 8393.38 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ శాఖకు చెందిన భూమి ఉంది. అటవీ భూమిని ఆక్రమణదారుల నుంచి రక్షించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పకడ్బందీగా పూనుకుంది. ఇందుకు అనేక ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే గొలుసు లింక్ ఫెన్సింగ్ పనులను ప్రారంభించంగా, ప్రస్తుతం అవి పురోగతిలో ఉన్నాయి. అటవీ భూములలో 40 ఫారెస్ట్ బ్లాక్లు ఉండగా, 25 కస్టర్లను ఏర్పాటు చేశారు. అయితే, 3660.00 హెకార్ట విస్తీర్ణం కలిగిన 13 ఫారెస్ట్ బ్లాకులలో నీలగిరి ప్లాంటేషన్లు టీఎస్ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ఉన్నాయి. మిగిలిన 4800 హెక్టార్లలో 4 అటవీ బ్లాకులైన మేడిపల్లి, దూలపల్లి, కండ్లకోయ, నారాపల్లి, నాగారం అటవీ శాఖల ద్వారా పట్టణ ఉద్యాన వనాలుగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అటవీ భూములు అధిక విస్తీర్ణంలో ఉన్న నేపథ్యంలో భూముల రక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని ఉద్యాన వనాలుగా తీర్చిదిద్ది కాపాడే చర్యలు చేపట్టింది. ఉద్యాన వనాల ఏర్పాటుతో భూమి చుట్టూ గొలుసు లింక్ ఫెన్సింగ్కు ప్రతిపాదించి చర్యలు చేపట్టింది.
వేలాది ఎకరాలలో అర్బన్ పార్కులు
అటవీ శాఖకు చెందిన వేలాది ఎకరాలలో ఉద్యాన వనాలను ఏర్పాటు చేసేందుకు అనేక నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం వెచ్చించింది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలో హైదరబాద్ మహా నగరంలో నివసించే ప్రజలకు ఆహ్లాదమైన వాతావారణం అందించేలా 15 అర్బన్ పార్కులను ఏర్పాటు చేసింది. దీనిని అటవీ శాఖ అర్బన్ పార్క్ల నిర్వహణతో పచ్చదనం పెంచే విధంగా చర్యలు తీసుకుంటుంది. ప్రతి ఏడాది హరితహారం కార్యక్రమంలో ఎండిన మొక్కల స్థానంలో తిరిగి మొక్కలు నాటి అర్బన్ పార్క్లలో పచ్చదనం మరింత పెంచుతూ వచ్చారు. హైదరాబాద్ సమీపంలో ఉన్న శివారు ప్రాంతాల భూముల ధరలు అమాంతం పెరగడంతో అటవీ భూములు ఆక్రమణలకు గురికాకండా గొలుసు లింక్ ఫెన్సింగ్ ఎంతో ఉపయోగకరంగా మారనుంది.