తెలుగు యూనివర్సిటీ, ఫిబ్రవరి 23 : బీసీ కార్పొరేషన్ ద్వారా ఇంద్రజాలికులకు (మెజీషియన్స్) రుణాలు అందించి స్వయం ఉపాధిని పొందేలా తగు తోడ్పాటును అందిస్తామని బీసీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం హామీనిచ్చారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, మెజీషియన్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో వర్సిటీ ఆడిటోరియంలో గురువారం పీసీ సర్కార్ జయంతి సందర్భంగా మెజీషియన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.
తెలుగు వర్సిటీలో ఇంద్రజాల కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెజిషీయన్ కోర్సు పూర్తి చేసిన వారికి సామగ్రిని సమకూర్చుకునేందుకు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించి ప్రోత్సహించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐజీ ఎస్.చంద్రశేఖర్రెడ్డి, తెలుగు యూనివర్సిటీ వీసీ ఆచార్య టి. కిషన్రావు, తదితరులు పాల్గొన్నారు.