సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : నగరంలోని అత్యంత సమస్యాత్మకమైన చెత్త కేంద్రాల్లో పని చేసిన పారిశుధ్య కార్మికులకు జీహెచ్ఎంసీ ప్రశంసా పత్రాలను సత్కరించింది. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కార్మికులకు ప్రశంసా పత్రాలను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రొనాల్డ్ రాస్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికుల కృషి వల్లనే జాతీయ స్థాయిలో జీహెచ్ఎంసీకి ఎన్నో అవార్డులు వచ్చాయన్నారు.
చెత్త తరలింపులో బాధ్యతాయుతంగా వ్యవహరించిన కార్మికులకు ప్రోత్సాహాకాలు ఇస్తామని, అవార్డులు సాధించిన కార్మికులు మిగితా వారికి స్పూర్తిని కలిగించాలని ఆమె అన్నారు. నగరంలో 3400 జీవీపీలను గుర్తించామని కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. అలాగే చెత్తను ఆటోలకు ఇవ్వని కుటుంబాలను గుర్తించి వారి ఇంటికి వెళ్లి మెప్మాతో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎస్ఎఫ్ఏలను ఢిల్లీ వరకు తీసుకెళ్లి అవార్డును తీసుకున్నామన్నారు. అదేవిధంగా డిప్యూటీ కమిషనర్లు ఉదయం ఆరు గంటలకే క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. కార్యక్రమంలో శానిటేషన్ యూసీడీ హెల్త్ అడిషనల్ కమిషనర్లు కమిషనర్లు ఉపేందర్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.