స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
మియాపూర్, జూన్ 6: స్వశక్తితో అభివృద్ధిలో అన్నింటా పురోగతి సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నదని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శేరి లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళల టూ వీలర్ డ్రైవింగ్ ట్రాక్ను, ఆవరణలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్ సహా అధికారులతో కలిసి మంత్రి సత్యవతి సోమవారం ప్రారంభించారు.
అనంతరం, జ్యూట్ బ్యాగ్ల తయారీలో శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్ జెండర్లకు సర్టిఫికెట్ల పంపిణీ, శిక్షణ పూర్తి చేసుకున్న 64 మంది మహిళలకు రోటరీ క్లబ్ సౌజన్యంతో కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనతి కాలంలోనే తెలంగాణ స్వశక్తితో ఆర్థికంగా నిలదొక్కుకుంటూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో పురోగమిస్తున్నదని తెలిపారు. మహిళా అభ్యున్నతికి సీఎం కేసీఆర్ చేపడుతున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. తమ శాఖ ఆధ్వర్యంలో మహిళలు స్వయం ఉపాధికి ఊతమిచ్చేలా పలు శిక్షణలను అందిసున్నట్లు, వాటిని సద్వినియోగపరుచుకుని ముందడుగు వేయాలని ఆమె ఆకాంక్షించారు.
విప్ గాంధీ మాట్లాడుతూ, కల్యాణ లక్ష్మి, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, ఆరోగ్య శ్రీ వంటి మహిళా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కేఆర్కే లక్ష్మి, మహిళా కార్పొరేషన్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సబిత, జిల్లా మేనేజర్ లక్ష్మి కుమారి, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, పార్టీ నేతలు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.