సిటీబ్యూరో, జూలై 15(నమస్తే తెలంగాణ): కొత్తగా ఆవిష్కరించబడుతున్న స్టార్టప్లు ప్రభుత్వానికి సంబంధించి ఏవైనా ఉత్పత్తులను తయారు చేస్తుంటే, వాటికి మొదటి కస్టమర్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ప్రపంచ నైపుణ్య దినోత్సవం సందర్భంగా శనివారం టీ హబ్లో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెఐటీవో) ఆధ్వర్యంలో 6వ వార్షిక సదస్సు, ఇన్వెస్టర్స్ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జయేష్ రంజన్ మాట్లాడుతూ సరికొత్త ఆవిష్కరణలకు అడ్డాగా మారిన టీ హబ్తో చేతులు కలిపితే మీ కలలు నెరవేరతాయన్నారు. రాష్ట్రం నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు సైతం టీ హబ్తో కలిసి ఆవిష్కరణలు చేసే స్టార్టప్లతో పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. మన దేశం నుంచే కాకుండా దుబాయ్, సింగపూర్, ఇతర ప్రాంతాల నుంచి జైన సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్తలు ముంబైకి బదులుగా ఈ కార్యక్రమాన్ని టీ హబ్లో నిర్వహించి మంచి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవస్థాపకతను పెంపొందించేందుకు టీ హబ్ నిర్వహణను ప్రత్యేక నిపుణులతో నిర్వహిస్తున్నదన్నారు. తెలంగాణకు టీ హబ్ ఒక కిరీటం లాంటిదని, ఇన్నోవేషన్ పాలసీ తీసుకువచ్చిన తర్వాత తొమ్మిది ఏండ్లలో 60 ఉత్పత్తులను స్టార్టప్ల నుంచే కొనుగోలు చేశామని జయేశ్ రంజన్ వెల్లడించారు. ఈ సందర్భంగా జైన పారిశ్రామిక వేత్తలకు పలు సూచనలు చేశారు. టీ హబ్లో ఉన్న స్టార్టప్లను ప్రోత్సహించాలని, వారికి మార్గ నిర్దేశం చేసేందుకు సమయం ఇవ్వాలని, టీ హబ్తో కలిసి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా టీ హబ్ సీఈఓ ఎం.ఎస్.రావుతో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు రజత్ మెహతా, రాజేష్ జైన్లతో ప్రత్యేకంగా ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జెఐటీవో ఆధ్వర్యంలో స్కిల్థాన్ ప్రారంభించారు. యువత కేవలం ఏడు రోజుల్లో వర్చువల్గా 108 నైపుణ్యాలను సాధించేలా దీనిని రూపొందించామని నిర్వాహకులైన అభయ శ్రీమల్ తెలిపారు.