నేడే హోలీ పండుగ
‘కొట్టు.. కొట్టు..కొట్టు.. రంగుతీసి కొట్టు.. రంగులోనే లైఫ్ ఉందిరా’ అంటూ నగరవాసులు హుషారుగా హోలీని జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే నగరంలో పలు సంస్థలు, హోటళ్లు హోలీ వేడుకలకు ఏర్పాట్లు చేశాయి. రంగులు చల్లుకుంటూ సందడిగా గడిపేందుకు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ రెడీ అయ్యారు. కోఠి, అబిడ్స్, సికింద్రాబాద్, అమీర్పేట్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో హోలీ సామగ్రి దుకాణాలు సందడిగా కనిపించాయి. కాగా, రసాయనాలు కలిగిన రంగులను వాడకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సహజ రంగులనే వినియోగించాలని హితవు పలికారు. సింథటిక్, డార్క్ కలర్స్ వాడకపోవడం మంచిదని తెలిపారు. శరీరాన్ని ఎక్కువగా కప్పి ఉంచే దుస్తులు వేసుకోవడం ఉత్తమమని సూచించారు. వేడుకల్లో కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, హోలీ పండుగ సోదర భావానికి ప్రతీక అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఆమె హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
రసాయన రంగులతో జాగ్రత్త
హోలీ పండుగ సంబురాల్లో పిల్లలు, పెద్దలు ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా కళ్లకు పెద్ద నష్టాలు సంభవించే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు సహజ రంగులనే వాడండి. రసాయన రంగులు వాడాల్సి వస్తే వాటిని చల్లుకునే సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రంగుల తీవ్రతను తగ్గించేందుకు నీటితో కలిపితే వాడితే మంచిది. సునేరు, పెట్రో ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. కంట్లో రంగులు పడితే వెంటనే చల్లటి నీటితో కడగాలి. టియర్ ప్లస్, రీఫ్రెష్ డ్రాప్స్ వంటిని ప్రాథమికంగా కంటిలో వేయాలి. సమస్య తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
– డాక్టర్ ఎస్. రవీందర్ గౌడ్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్