ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 27: విద్యార్థులు తమ లక్ష్యసాధన దిశగా పనిచేయాలని ప్రముఖ సినీ దర్శకుడు, ఓయూ పూర్వ విద్యార్థి శేఖర్ కమ్ముల అన్నారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని ముందుగా ఎంచుకోవాలని చెప్పారు. ఆ తరువాత సదరు రంగంలో నిష్ణాతులుగా మారేందుకు ప్రయత్నించాలని సూచించారు. కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ (సీఈసీ), యూజీసీ ఆధ్వర్యంలో ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను ఓయూలో నిర్వహిస్తున్నారు. ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ 24వ జాతీయ ఎడ్యుకేషనల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శేఖర్ కమ్ముల హాజరై మాట్లాడారు. హైదరాబాద్ మహానగరం ముత్యాలు, బిర్యానీకే కాకుండా స్వచ్ఛమైన ప్రేమకు మారుపేరని అన్నారు.
హైదరాబాద్ నగరం వేదికగా మహ్మద్ కులీ కుతుబ్షా – భాగమతిల ప్రేమకు చిహ్నంగా నిలిచిన పురానాపూల్, మరో గొప్ప ప్రేమకథకు వేదికైన కోఠి మహిళా విశ్వవిద్యాలయ భవనాన్ని ఉటంకించారు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు, అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మ, మహ్మద్ అజారుద్దీన్, హర్షా భోగ్లే, శ్యామ్ బెనగల్ వంటి గొప్ప వ్యక్తులను ఓయూ అందించిందని కొనియాడారు. అలాంటి ఓయూలో విద్యను అభ్యసించడం తనకు గర్వంగా ఉందని చెప్పారు. ఓయూలో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యారంగ చలన చిత్ర నిర్మాతలను ప్రోత్సహించడంలో సీఈసీ – యూజీసీ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. తాను ఎప్పుడూ అవార్డులు, హిట్ల గురించి ఆలోచించలేదని, కేవలం తన కలలు, ఆసక్తి ఆధారంగా మాత్రమే సినిమాలు తీస్తానని వివరించారు. సభాధ్యక్షత వహించిన సీఈసీ డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ భూషణ్ నడ్డా మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో విద్యార్థుల నమోదులో స్థూల జాతీయ సగటు కేవలం 27 శాతమేనని, దీనిని 2035 నాటికి 50 శాతానికి పెంచాలనేది కేంద్రప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సంప్రదాయ విద్యావిధానం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోలేమన్న ఆయన డిజిటల్ విద్యావిధానం ద్వారానే ఇది సాధ్యమని వివరించారు.
ఈ పనిని పూర్తి చేయడంలో సీఈసీ కీలక భూమిక పోషిస్తోందని చెప్పారు. త్వరలో అందుబాటులోకి రానున్న డిజిటల్ విశ్వవిద్యాలయాలకు డిజిటల్ కంటెంట్ను సీఈసీ అందిస్తుందని వివరించారు. ప్రస్తుతం విద్య నేర్చుకోవడం అనేది కేవలం తరగతి గదికి మాత్రమే పరిమితమై లేదన్న ఆయన..ఆధునిక తరం విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా బోధనా పద్ధతులు, పాఠ్యాంశాలను మార్చుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు సైతం సమకాలీన అవసరాలకు అనుగుణంగా సన్నద్ధం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, సీఈసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ మెహ్రూ, ఓయూ యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం, ఈఎంఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ మృణాళిని, ప్రొఫెసర్ శ్రీరాములు, ప్రొఫెసర్ మంగు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్ ప్యాట్రిక్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.