సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ): ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో 2,728 మంది నుంచి కోట్ల రూపాయలు స్వాహా చేసిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేసులో నగర నేర పరిశోధనా విభాగం దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా గురువారం సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ నందు పూర్ణచందర్రావు నివాసంతో పాటు పలు కార్యాలయాల్లో సీసీఎస్ పోలీసులు సోదాలు జరిపారు. అంతేకాకుండా.. సాహితీ ఇన్ఫ్రాటెక్కు చెందిన లక్ష్మీనారాయణకు భూమి విక్రయిస్తానంటూ డబ్బులు తీసుకుని.. మోసం చేసిన గేదెల శ్రీనుబాబు సహా మరో ఐదుగురు ఫైనాన్సర్ల ఇండ్లు, కార్యాలయాలు.. మొత్తం 10 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపారు.
ఈ సోదాల్లో లెక్కల్లో చూపించని రూ.30 లక్షల నగదుతో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సాహితీ, అనుబంధ సంస్థలతో పాటు యాజమాన్యం, వారి కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల పేర్లతో ఉన్న ఆస్తులను గుర్తించేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఈ మేరకు సిట్ అధికారులు రెండు తెలుగు రాష్ర్టాల్లోని సబ్- రిజిస్ట్రార్లకు లేఖలు రాశారు. ఆస్తులపై ఒక స్పష్టత వచ్చిన తరువాత వాటిని ఎటాచ్మెంట్ చేయాలని కోరుతూ ప్రభుత్వానికి సీసీఎస్ అధికారులు లేఖ రాయనున్నట్లు సమాచారం.