సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రెండు వేరు వేరు సైబర్ నేరాలలో బాధితులు పొగొట్టుకున్న రూ.21,55,331 సొమ్మును సీసీఎస్(CCS police) సైబర్క్రైమ్ పోలీసులు తిరిగి ఇప్పించినట్లు( recover money) డీసీపీ దార కవిత తెలిపారు. మీ పేరుతో వచ్చిన పార్శిల్లో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, మేం ట్రాయ్, సీబీఐ అధికారులమంటూ 67 ఏండ్ల వృద్దుడికి ఫోన్ చేసి అతడి వద్ద నుంచి సైబర్నేరగాళ్లు(Cyber criminals) రూ. 8,05,331 వివిధ ఖాతాలలోకి బదిలీ చేయించారు.
అలాగే ట్రేడింగ్లో మంచి లాభాలిప్పిస్తామంటూ నమ్మించి మరో ఘటనలో బాధితుడి వద్ద నుంచి రూ.13.5 లక్షలు కాజేశారు. ఈ రెండు ఘటనలపై వేరు వేరుగా కేసు నమోదు చేసుకొని ఇన్స్పెక్టర్లు మధుసుదన్రావు, ఎస్.నరేష్ బృందాలు దర్యాప్తు జరిపాయి. నిందితుల బ్యాంకు ఖాతాలను గుర్తించి వాటిని ఫ్రీజ్ చేశారు. నాంపల్లి 12వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు, మేజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఆదేశాలతో రూ. 21,55,331 నగదును బాధితుల వారి వారి ఖాతాలలో బదిలీ చేయించినట్లు డీసీపీ తెలిపారు.