కాలనీ మొత్తం సీసీ రోడ్లు వేయాలి
డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో తాగునీటి సమస్య రానివ్వొద్దు
అధికారులను ఆదేశించిన మంత్రి తలసాని
బన్సీలాల్పేట్, ఏప్రిల్ 6 : చాచానెహ్రూనగర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం బన్సీలాల్పేట్ డివిజన్లోని చాచానెహ్రూనగర్లో జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంతకుమారి, తాసీల్దార్ బాలశంకర్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, హౌజింగ్ ఈఈ వెంకట్దాస్ రెడ్డి, బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కె.హేమలతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిసరాల ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సీసీ నగర్లో మరికొందరు స్థానికులు తమకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరగా, సర్వే నిర్వహించి ప్రతిపాదనలు రూపొందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నూతన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో తాగునీరు సక్రమంగా రావడం లేదని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకురాగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జలమండలి జీఎం రమణారెడ్డిని ఆదేశించారు. సీసీ నగర్ బస్తీ మొత్తం సిమెంట్ రోడ్లను వేయడానికి ప్రతిపాదనలు తయారుచేయాలని జీహెచ్ఎంసీ ఇంజినీర్లకు సూచించారు.
ఫేజ్ 2 బస్తీలో సింటెక్స్ ట్యాంక్ ప్రారంభం
చాచానెహ్రూనగర్ ఫేజ్ 2 బస్తీలో అనేక ఏండ్లుగా రోజువారి వాడుక నీటి ఎద్దడి తొలగించడానికి నూతనంగా మంజూరు చేసిన నిధులతో ఏర్పాటు చేసిన పవర్ బోరు, సింటెక్స్ ట్యాంక్ను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రారంభించారు. మంత్రికి, అధికారులకు స్థానిక మహవీర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కుంచపు నర్సింగ్రావు, కల్యాణ్రామ్, వెంకటేశ్, అజయ్కుమార్ శాలువాలు కప్పి సన్మానించారు. సభ్యులు శివప్రసాద్, చాంద్, బినేశ్, చిన్నా, మురళి, అజీమ్, టీఆర్ఎస్ నాయకులు కె.లక్ష్మీపతి, వెంకటేశన్, రాజు, కేఎం.కృష్ణ, ప్రేమ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన శోభనాద్రి అపార్ట్మెంట్ వాసులు
అమీర్పేట్, ఏప్రిల్ 6 : అమీర్పేట్ డీకే రోడ్డులోని హనుమాన్ దేవాలయం సమీపంలో భవన నిర్మాణ సామగ్రిని రోడ్డుపైనే వేయడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని శోభనాద్రి అపార్టుమెంట్ పరిసర వాసులు మాజీ కార్పొరేటర్ శేషుకుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో బుధవారం కాలనీ వాసులు రాఘవేంద్ర, రాజేశ్మాధుర్, తదితరులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ నివాసానికి వెళ్లి సమస్యను మంత్రికి వివరించారు. వెంటనే స్పందించిన మంత్రి తక్షణమే సమస్యను పరిష్కరించాలని సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.