సిటీబ్యూరో/శేరిలింగంపల్లి, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ): నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడినా లేదా వినియోగించినా సహించేది లేదని, ఎంతటి వారైనా జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు ట్రై కమిషనరేట్ పోలీసులు. మరో వైపు నూతన సంవత్సర వేడుకల ఈవెంట్కు సంబంధించి అనుమతి ఇవ్వకముందే టికెట్లు విక్రయించిన సన్బర్న్ ఈవెంట్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ అదనపు డీసీపీ నర్సింహా రెడ్డి తెలిపారు. సోమవారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అదనపు డీసీపీ మాట్లాడుతూ… మాదాపూర్ పీఎస్ పరిధిలో ఉన్న సన్బర్న్ ఈవెంట్ నిర్వాహకులు సన్బర్న్ మ్యూజికల్ నైట్ పేరిట న్యూఇయర్ ఈవెంట్ నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకున్నారని, అయితే వారి దరఖాస్తు ఇంకా పరిశీలనలోనే ఉందన్నారు. కానీ ఈవెంట్కు సంబంధించిన టికెట్లను విక్రయించినట్లు తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు. ఈ మేరకు అనుమతి రాకముందే బుక్ మై షోలో టికెట్లు విక్రయించినట్లు తమ విచారణలో వెల్లడయిందన్నారు. పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే రూ.1499 ప్రారంభ ధర నుంచి రూ. 4999 చొప్పున టికెట్లు విక్రయించడం చట్ట విరుద్ధమని, దీంతో సన్బర్న్ ఈవెంట్ ఆర్గనైజర్ సుమన్పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు అదనపు డీసీపీ వెల్లడించారు. అలాగే అనుమతి లేని ఈవెంట్కు సంబంధించిన టికెట్ల జారీకి సహకరించిన బుక్ మై షో నోడల్ ఆఫీసర్, ఎండీలకు సైతం నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.
న్యూ ఇయర్ వేడుకలపై అవగాహన కల్పించాం
కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించి ఇప్పటికే ఈవెంట్ నిర్వాహకులకు అవగాహన కల్పించామని, మాదాపూర్ అదనపు డీసీపీ నర్సింహారెడ్డి తెలిపారు. మాదాపూర్ జోన్ పరిధిలో ఇప్పటివరకు న్యూఇయర్ ఈవెంట్ల అనుమతికి సంబంధించి మొత్తం 22 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిలో ఇప్పటి వరకు ఒక ఈవెంట్కు మాత్రమే అనుమతి ఇచ్చామని తెలిపారు. ఈ లోపు ఎవరైనా ఈవెంట్ నిర్వాహకులు టికెట్ల విక్రయానికి పాల్పడితే చట్టరీత్య చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా న్యూఇయర్ వేడుకల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సీసీ కెమెరాల నిర్వహణకు ప్రత్యేకంగా ఒకరిని నియమించుకోవాలన్నారు. డిసెంబర్ 31 తేదీ రాత్రి 1గంటలోపు ఈవెంట్లు పూర్తిగా నిలిపివేసే చర్యలు తీసుకోవాలని చెప్పారు. గేటెడ్ కమ్యూనిటీస్, కాలనీల్లో పార్క్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో సౌండ్ సిస్టమ్ నిర్వహణకు స్థానిక ఏసీపీ నుంచి అనుమతి తప్పనిసరన్నారు. ఈ సమావేశంలో మాదాపూర్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ తిరుపతి, గచ్చిబౌలి డీఐ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.