ఖైరతాబాద్, ఏప్రిల్ 15 : నగరానికి చెందిన ఓ పాల వ్యాపారి అనుమతులు లేకుండా ప్రైవేట్ గన్మెన్లను నియమించుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆయుధాలతో శుక్రవారం ఎన్టీఆర్ గార్డెన్ వద్ద జరిగిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వచ్చా డు. అతడితోపాటు ప్రైవేట్ గన్మెన్తో లోనికి ప్రవేశించాడు. ఎలాంటి లైసెన్సు, శిక్షణ లేని డ్రైవర్ సైతం రైఫిల్తో వారిని అనుసరించి లోనికి వచ్చేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. వారందరినీ విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. ఖైరతాబాద్కు చెందిన పాల వ్యాపారి దొండ్ల మధు యాదవ్ ఎక్స్ సర్వీస్మెన్ గురుసాహెబ్ సింగ్ను ప్రైవేట్ గన్మెన్గా నియమించుకున్నాడు. అతడికి నెలకు రూ.60వేల వేతనం ఇస్తున్నాడు. శుక్రవారం ఖైరతాబాద్లోని ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు ప్రైవేట్ గన్మెన్ గురు సాహెబ్ సింగ్తో కలిసి వచ్చాడు. మధుయాదవ్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న వద్దినేని శివప్రకాశ్(28) సైతం కారులో ఉన్న పెద్ద రైఫిల్ను తీసుకొని వారిని అనుసరించాడు. దీంతో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి పిస్టల్, రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు ఆయుధాలు జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో లైసెన్సు కలిగి ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీసు శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ప్రైవేట్ గన్మెన్లు పెట్టుకోవాలంటే కనీసం హైదరాబాద్లో మెజిస్ట్రేట్ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి అనుమతులు లేకపోవడంతో యజమాని మధుయాదవ్, గన్మెన్ గురు సాహెబ్ సింగ్, లైసెన్సు, శిక్షణ తీసుకోకుండా హై సెక్యూరిటీ జోన్లో ప్రవేశించినందుకు డ్రైవర్ వద్దినేని శివ ప్రకాశ్లను అదుపులోకి తీసుకొని నిందితులపై సెక్షన్ 25 ఐబీ (ఎ), 30 ఆర్మ్స్ యాక్ట్ 1959 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.