బంజారాహిల్స్ : ప్రేమిస్తున్నానని మహిళను నమ్మించడంతో పాటు ఏడాదిన్నర కాలంగా సహజీవనం చేసి ముఖం చాటేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన ఒక మహిళ (24) భర్తతో విడిపోయి తన నాలుగేండ్ల కొడుకుతో 2018లో బతుకుదెరువు కోసం నగరానికి వచ్చింది.
జవహర్నగర్లో నివాసం ఉంటూ జూబ్లీహిల్స్లోని ఓ ఆస్పత్రిలో కన్సల్టెంట్గా ఉద్యోగం చేస్తోంది. ఏడాదిన్నర క్రితం షేర్చాట్ ద్వారా కే. ప్రసాద్ (23) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానంటూ నమ్మించడంతో ఇద్దరూ కలిసి గది అద్దెకు తీసుకుని సహజీవనం చేశారు. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటున్నానని మెడలో తాళి కట్టాడు.
కాగా పెద్దల సమక్షంలో కానీ రిజిస్టర్ మ్యారేజీ కానీ చేసుకోవాలని గత కొంతకాలంగా ప్రసాద్ను ఆమె ఒత్తిడి చేస్తోంది. ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో వెంటనే పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో సొంతూరు వెళ్లి వస్తానంటూ జనవరిలో వెళ్లిన ప్రసాద్ తిరిగి రాలేదు. దాంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈమేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.