సిటీబ్యూరో, మార్చి 23(నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా హోలీ పండుగ రోజున మద్యం విక్రయించేందుకు పెద్దఎత్తున మద్యం కొనగోలు చేసి, తరలిస్తున్న ఓ వ్యక్తిని సెంట్రల్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.2.5లక్షల విలువైన మద్యంతో పాటు రవాణాకు వినియోగించిన ఓమ్ని వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… బషీర్బాగ్లోని పూల్బాగ్కు చెందిన నౌకత్ కిరణ్కుమార్(35) వృత్తిరీత్యా పండ్ల వ్యాపారి. అయితే సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో కిరణ్కుమార్ రానున్న హోలీ పండుగ రోజు మద్యం విక్రయాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
హోలీ రోజు మద్యం దుకాణాలు మూసి ఉండటం వల్ల అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలనే ప్రణాళికలో భాగంగా శుక్రవారం రాత్రి లక్డీకాపూల్లోని మయూరి వైన్స్లో రూ.2.5లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను కొనుగోలు చేశాడు. ఆ మద్యం తన ఓమ్నీ వ్యాన్లో ఇంటికి తరలిస్తుండగా సమాచారం అందుకున్న సెంట్రల్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఇగ్బాల్ మినార్ క్రాస్రోడ్ వద్ద కిరణ్కుమార్ను అదుపులోకి తీసుకుని, ఓమ్నీ వ్యాన్లో ఉన్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి, తదుపరి విచారణ నిమిత్తం కేసును సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. టాస్క్ఫోర్స్ డీసీపీ ఎస్.రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు జరిగిన ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎన్.రామకృష్ణ, ఎస్ఐ సీహెచ్.నవీన్కుమార్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.