సికింద్రాబాద్ : కంటోన్మెంట్లోని బీజేపీ నేతలపై మూడో వార్డు మడ్ఫోర్డ్ లోని గాంధీనగర్, శ్రీరాంనగర్కు చెందిన డబుల్ బెడ్రూం ఇండ్ల మహిళలు అగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్కారు తమకు డబుల్ ఇండ్లు ఇవ్వడమే కాకుండా మౌళిక వసతులు కల్పిస్తుంటే శిలాఫలకాలపై తమ పేర్లు లేవని బీజేపీ నాయకులు ఆందోళన చేయడం ఏమిటని స్థానిక మహిళలు ప్రశ్నించారు.
ఇండ్ల వద్దకు వచ్చి ఘర్షణకు దిగుతుండటంపై మహిళలు మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు రప్పించి కంటోన్మెంట్ ప్రజల వెతలను తీర్చలేని బీజేపీ నాయకులు పేర్ల కోసం ఆందోళన చేయడం ఏమిటని ప్రశ్నించారు. మహంకాళి జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి బీఎన్ శ్రీనివాస్ నేతృత్వంలో పట్టుమని పది మంది కూడాలేని కాషాయ శ్రేణులు డబుల్ ఇండ్ల వద్ద గందరగోళం సృష్టించేందుకు యత్నించారు.
దీనికి స్థానిక మహిళలు ధీటుగా సమాధానమిచ్చారు. నామినేటెడ్ సభ్యుడి పేరు శిలాఫలకంపై పెట్టాలని బీజేపీ శ్రేణులు నినాదాలు చేయడంతో మహిళలు తిరగబడ్డారు. రాష్ట్ర సర్కారు నిధులతో డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయాలకు నూతన మంచినీటి పైపులైన్ పనులకు శ్రీకారం చుడుతున్న తరుణంలో చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని బీజేపీ నేతలను పంపించారు. అయితే మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తగిన గుణపాఠం చెబుతామని మహిళలు హెచ్చరించారు.