హైదరాబాద్, జూలై 22 : రాష్ర్టానికి చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.434.8 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.1,409.6 కోట్ల లాభంతో పోలిస్తే 69.2 శాతం క్షీణత కనబరిచింది. సెమాగ్లుటైడ్ పదార్థాలకు సంబంధించిన అంశాల ప్రభావంతోపాటు ఉత్తర అమెరికాలో జనరిక్ మందుల ఆదాయం తగ్గడం వంటి ప్రతికూల అంశాలు లాభాలపై ప్రభావం చూపాయని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.8,545.2 కోట్ల నుంచి రూ.8,070.5 కోట్లకు పడిపోయినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.
అలాగే నిర్వహణ ఖర్చులు రూ.3,115. 2 కోట్ల నుంచి రూ.3,375.6 కోట్లకు ఎగబాకాయి. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ కో-చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ మాట్లాడుతూ..గత త్రైమాసికంలో పనితీరు ఆశించిన స్థాయిలో లేదని, సెమాగ్లుటైడ్ పదార్థాలకు సంబంధించిన అంశాలతోపాటు ఉత్తర అమెరికాలో విక్రయాలు మందకొడిగా ఉండటం ఇందుకు కారణమన్నారు. గత త్రైమాసికంలో ఇన్వెంటరీ నష్టాలు రూ.239.7 కోట్లు రావడం కూడా లాభాలపై గండిపడిందన్నారు. అంతర్జాతీయంగా జనరిక్ ఔషధాలను విక్రయించడంతో సంస్థకు రూ.7,199.3 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది.