సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ సహా దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డుల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 30వ తేదీన పోలింగ్ జరగాల్సి ఉన్నందున మరో నాలుగైదు రోజుల్లోనే బోర్డు అధికారులు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. ముఖ్యంగా గ్రేటర్లో కంటోన్మెంట్ బోర్డు విలీన ప్రతిపాదనను తెరపైకి తెచ్చి, కమిటీని కూడా ఏర్పాటు చేసిన కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ.. అకస్మాత్తుగా ఎన్నికలకు పచ్చజెండా ఊపడంతో విలీనంపై సందిగ్ధత నెలకొంది. రెండేండ్లుగా ఎదురుచూస్తున్న బోర్డు ఎన్నికలకు గెజిట్ జారీ కావడంతో 2006 చట్టం ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. దీని ప్రకారం బోర్డు ఉపాధ్యక్షుడి ఎన్నిక అనేది పరోక్షంగానే జరగనుంది. 60 రోజుల్లో బోర్డు ఎన్నికలు పూర్తి కానున్న నేపథ్యంలో కంటోన్మెంట్లో రాజకీయంగానూ వేడి మొదలైంది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నగారా మోగింది. సికింద్రాబాద్ సహా దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డుల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 30న పోలింగ్ జరగాల్సి ఉన్నందున మరో నాలుగైదు రోజుల్లోనే బోర్డు అధికారులు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. ముఖ్యంగా గ్రేటర్లో కంటోన్మెంట్ బోర్డు విలీన ప్రతిపాదనను తెరపైకి తెచ్చి, కమిటీని కూడా ఏర్పాటు చేసిన కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ… అకస్మాత్తుగా ఎన్నికలకు పచ్చజెండా ఊపడంతో విలీనంపై సందిగ్ధత నెలకొంది. కాగా రెండేండ్లుగా ఎదురుచూస్తున్న బోర్డు ఎన్నికలు గెజిట్ జారీ కావడంతో రాజకీయంగా వేడి మొదలైంది. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో వివిధ రకాలుగా నిత్య నరకాన్ని అనుభవిస్తున్న ప్రజలకు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఎన్నికల వాతావరణం రానే వచ్చింది. కంటోన్మెంట్ బోర్డు చట్టం 2006 (40 ఆఫ్ 2006)లోని సబ్ సెక్షన్ (1) ప్రకారం కేంద్ర ప్రభుత్వం బోర్డు ఎన్నికలకు నిర్ణయించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ రాకేశ్ మిట్టల్ ఈ నెల 17న గెజిట్ జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ 30న పోలింగ్ తేదీని ఖరారు చేసింది. బోర్డు ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ 60 రోజుల్లో పూర్తి కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే బుధవారం లోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలవనుండగా… రానున్న రెండు నెలల పాటు బోర్డు పరిధిలో ఎన్నికల కోలాహలం నెలకొననుంది.
తగ్గిన 35వేల ఓట్లు…
కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఎనిమిది వార్డుల్లో 2015 ఫిబ్రవరిలో నిర్వహించిన ఎన్నికల్లో 1,67,936 మంది ఓటర్లతో జాబితాను రూపొందించారు. అయితే తాజా ఎన్నికల్లో మాత్రం 1,32,722 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. గతంలోని ఓటర్లు జాబితాలో మిలిట్రీ , ఎయిర్పోర్టు అథారిటీ భూముల్లో నివసిస్తున్న వారి ఓట్లను తొలగించారు. దీంతో 35,274 మంది ఓటర్ల పేర్లను తొలగించారు. కంటోన్మెంట్ బోర్డు 2006 చట్టం ప్రకారమే ఈసారి కూడా ఎన్నికల ప్రక్రియ జరగనుంది. వాస్తవానికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఈ చట్టానికి పలు సవరణలు చేస్తూ కొత్త చట్టాన్ని రూపొందించింది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి, ఆమోదం తెలుపుతుందని అందరూ భావించారు. కానీ కేంద్రం ఆ ఊసే ఎత్తలేదు.
విలీనం మాటేమిటి?
రెండేండ్లుగా ఎదురుచూస్తున్న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు ఎట్టకేలకు వచ్చినప్పటికీ… విలీన ప్రతిపాదనపై చర్చ జరుగుతుంది. మంత్రి కేటీఆర్ ఒత్తిడి మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిని గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు హైపవర్ కమిటీని కూడా నియమించింది. అయితే కొన్ని రోజులకే తాజాగా ఎన్నికలను ప్రకటించడంతో విలీన ప్రతిపాదనకు మోక్షం కలుగుతుందా? లేదా? అనేది సందేహంగా మారింది. అయితే ఒకవేళ రక్షణ శాఖ విలీనం వైపే అడుగులు వేస్తే అందుకు ఈ ఎన్నికలు అడ్డు కావనే వాదనలు వినిపిస్తున్నాయి. 2006లో కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చేందుకు కేంద్రం అప్పటికి సుమారు మూడు నెలల ముందే ఏర్పడిన పాలకవర్గాన్ని రద్దు చేసినట్లు పలువురు గుర్తు చేస్తున్నారు.