సికింద్రాబాద్ : కేంద్ర రక్షణ శాఖ నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ చార్జీలను విడుదల చేయించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఈవో అజిత్రెడ్డిని ఎమ్మెల్యే సాయన్న కోరారు. ఈ మేరకు బుధవారం కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న బోర్డు కార్యాలయంలో సీఈవోతో సమావేశమయ్యారు.
బోర్డు పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సహకరించాలని, అధికారులు త్వరితగతిన పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పలు అంశాలతో పాటు సర్వీస్ చార్జీల బరాయిలను తెప్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
కంటోన్మెంట్ బోర్డుకు దాదాపు రూ.670 కోట్లు సర్వీస్ చార్జీలు రావాల్సి ఉందని, ఇందులో కనీసం 300 కోట్లను విడుదల చేస్తే కంటోన్మెంట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. సర్వీస్ చార్జీలపై కేంద్రం స్పందించకుంటే కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.
నిత్యం నీతులు చెప్పే బీజేపీ నేతలకు బకాయిలును తెప్పించే దమ్ముందా అని ప్రశ్నించారు. రాష్ట్ర సర్కారు బోర్డు పరిధిలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నా, కేంద్రం మాత్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా చోధ్యం చూస్తుందని విమర్శించారు. దీనికి స్పందించిన సీఈఓ త్వరలో జరగబోయే బోర్డు సమావేశంలో దీనిపై చర్చిద్దామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, శ్యాంకుమార్, నళినికిరణ్, లోక్నాధంతో పాటు నేతలు టీఎన్ శ్రీనివాస్, సదానంద్గౌడ్, తేజ్పాల్, సంతోష్, విజయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.