వెంగళరావునగర్, జనవరి 2 : లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తున్నానంటూ ఓ వ్యక్తి తన సోదరుడికి మెసేజ్ పంపి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ ఎస్ఆర్టీ నగర్కు చెందిన మహ్మద్ అబ్దుల్ మతీన్ (34) డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 30న బేగంపేటకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతడికి పలుమార్లు ఫోన్ చేశారు.
మధ్యాహ్నం 1.45 గంటలకు తన కుమారుడు అబ్దుల్కు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పాడు. చెప్పినట్లు ఇంటికి రాకపోగా.. తన సోదరుడు మహ్మద్ అబ్దుల్ ముజాహిద్ ఫోన్కు ఓ మెసేజ్ పంపాడు. రుణ యాప్ల నిర్వాహకులు వేధింపులు భరించలేక పోతున్నాను.. తాను ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తున్నాను.. అని చెప్పి ఫోన్ స్విచాఫ్ చేశాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మతీన్ ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఎస్సై తెలిపారు.