సిటీబ్యూరో, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ): పాన్ షాపుల్లో గంజాయి రోలర్ పేపర్లు పట్టుబడ్డాయి. యువతను మత్తుకు బానిసలుగా మార్చేందుకు పాన్ షాపు నిర్వాహకులు గంజాయిని, పొగాలో కలిపి వాటిని సిగరెట్లుగా మార్చేందుకు ఈ రోలర్ పేపర్స్ను వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా గంజాయితో కలుపుకుని తినే గమ్ స్టిక్కర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ ఎస్వోటీ పోలీసులు శనివారం ఎల్బీనగర్, చైతన్యపురి, సరూర్నగర్, మీర్పేట్, నేరేడ్మెట్, మేడిపల్లి, ఘట్కేసర్ తదితర ప్రాంతాల్లో ఎల్బీనగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ రవికుమార్ నేతృత్వంలోని బృందం 60 పాన్ షాపుల్లో తనిఖీలను చేపట్టగా, ఇవి దొరికాయి. వీటితోపాటు నిషేధిత గుట్కా, జర్దా, గంజాయిని పీల్చేందుకు అవసరమయ్యే సామగ్రి, హుక్కా కుండలను కూడా స్వాధీనం చేసుకొని..మొత్తం 38 మందిపై కేసులను నమోదు చేశారు. కాగా, నగరంలో మొత్తం 12 గంజాయి కేసులు నమోదయ్యాయి. 18 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.