Cantonment Elections | కంటోన్మెంట్, మార్చి 17 : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేస్తూ కేంద్ర రక్షణ శాఖ శుక్రవారం గెజిట్ విడుదల చేసింది. కేంద్ర రక్షణ శాఖ ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్ను కేంద్రానికి ఉన్న ప్రత్యేక అధికారాలతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోని కంటోన్మెంట్ బోర్డులకు కేంద్రం ఎన్నికల నిర్వహణకు ఫిబ్రవరి 17న నోటిఫికేషన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించనున్నట్టు తొలుత ప్రకటించారు. అయితే ఓటమి భయంతో పాటు కంటోన్మెంట్లపై బీజేపీ పెత్తనం చెలాయించాలంటే ఎన్నికలను రద్దు చేయడమే మేలని కేంద్ర పెద్దలు భావించడంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడినట్లు తెలుస్తున్నది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేస్తూ కేంద్ర రక్షణ శాఖ శుక్రవారం గెజిట్ విడుదల చేసింది. కేంద్ర రక్షణ శాఖ ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్ను కేంద్రానికి ఉన్న ప్రత్యేక అధికారాలతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోని కంటోన్మెంట్ బోర్డులకు కేంద్రం ఎన్నికల నిర్వహణకు గాను ఫిబ్రవరి 17న నోటిఫికేషన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా తొలుత ప్రకటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఎనిమిది వార్డులున్నాయి. 2015లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు జరిగాయి. 2020 ఫిబ్రవరిలో కంటోన్మెంట్ బోర్డు పాలకవర్గం గడువు ముగిసింది. దీంతో కేంద్రం నామినేటెడ్ సభ్యుడిని నియమించింది. కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలు 6 నెలలు వాయిదా వేయాలంటూ నామినేటెడ్ సభ్యులు కోరగా, రక్షణ శాఖ స్పందించి రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కానీ, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది మాత్రం స్పష్టం చేయకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు చేపట్టిన ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్న తరుణంలో బోర్డు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కంటోన్మెంట్ వికాస్ మంచ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణను కోర్టు 20వ తేదీన జరగనుంది.
దేశ వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న కారణంగా కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో ఆపేందుకు శత విధాల కమలనాథులు ప్రయత్నించారు. ఎన్నికలకు వెళ్తే ఓటమి ఖాయమనే భయంతో గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని కంటోన్మెంట్ల నామినేటెడ్ సభ్యులు ఒత్తిడి తీసుకొచ్చి మరీ ఎన్నికలను రద్దు చేయించినట్లు తెలుస్తున్నది.
ఆయా కంటోన్మెంట్లలో బీజేపీకి చెందిన నేతలే నామినేటెడ్ సభ్యులుగా ఉండడంతో కేంద్రం కూడా కొత్త యాక్ట్ పేరుతో సభ్యులు చెప్పిన దానికి తలూపి ఎన్నికలను రద్దు చేసినట్లు సమాచారం. కంటోన్మెంట్లలో బీజేపీ పెత్తనం చెలాయించాలంటే ఎన్నికలను రద్దు చేయడమే మేలనే దానికి కేంద్ర పెద్దలు రావడంతోనే బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. 57 కంటోన్మెంట్లలో పరిస్థితి పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా ఉండడమే కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమదే విజయమని మీడియా ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నేతలు ఎన్నికలు వచ్చేసరికి తోకముడవడం గమనార్హం. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి, తీరా ఎన్నికల బరిలోకి దిగే సమయం రావడంతో దొడ్డిదారిన ఎన్నికలను ద్దు చేయించడంపై పలువురు మండిపడుతున్నారు.