సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం, తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, నాంపల్లిలోని భరోసా, షీటీమ్స్ కార్యాలయాలను బెంగళూర్లోని కెనడా కాన్సులేట్ జనరల్ డానియల్ మోరెన్సీ, న్యూఢిల్లీలోని కెనడా హై కమిషన్ క్లాడ్ రోచన్, జస్విందర్సింగ్ తదితర అధికారుల బృందం శుక్రవారం సందర్శించింది. వీరికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పలు అంశాలను వివరించారు.
అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు, అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా పోలీసు బలగాలను ఉపయోగించేందుకు తీసుకుంటున్న చర్యలు.. ఆధునిక టెక్నాలజీ వ్యవస్థతో ప్రజలకు కల్పిస్తున్న భద్రతపై సీపీ సీవీ ఆనంద్ వివరించారు. అంతకు ముందు హాకా భవన్లోని షీ టీమ్స్, భరోసా కేంద్రాన్ని కెనడా బృందం సందర్శించింది. వారికి సీసీఎస్ డీసీపీ స్నేహా మెహ్రా తెలంగాణతోపాటు రాష్ట్ర రాజధానిలో మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలతో పాటు చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టుల గూర్చి వివరించారు.