బంజారాహిల్స్, ఏప్రిల్ 14: జూబ్లీహిల్స్లోని ఓ ప్రైవేటు సంస్థ యాజమాన్య హక్కుల బదలాయింపు వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో పాటు కిడ్నాప్, బ్లాక్ మెయిల్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీతో పాటు ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్ఐ మల్లిఖార్జున్పై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. జూబ్లీహిల్స్లోని క్రియా హెల్త్కేర్ సంస్థకు సంబంధించిన లావాదేవీల్లో వ్యాపారవేత్త వేణుమాధవ్తో అదే సంస్థలో డైరెక్టర్లుగా ఉన్నవారి మధ్య వివాదం ఉంది. ఈ వివాదం సెటిల్మెంట్కు 2018, నవంబర్లో టాస్క్ఫోర్స్ పోలీసులు కిడ్నాప్ చేయడంతో పాటు అప్పటి డీసీపీ రాధాకిషన్రావు, ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జున్ తదితరులు తనను బెదిరించి, తన పేరుతో ఉన్న షేర్లను సంస్థలోని ఇతర డైరెక్టర్ల పేర్లపై బలవంతంగా మార్పిడి చేయించారంటూ ఇటీవల జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రాధాకిషన్రావు, గట్టుమల్లు, మల్లికార్జున్తో పాటు కృష్ణారావు, వ్యాపారవేత్తలు చంద్రశేఖర్ వేగే, రాజశేఖర్ తలశిల, సూరెడ్డి గోపాలకృష్ణ, రవికుమార్, బాలాజీ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
నిందితుల్లో ఓ సినీ నిర్మాత సైతం ఉండటంతో వారిని అరెస్టు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇదిలా ఉండగా.. వేణుమాధవ్, చంద్రశేఖర్కు మధ్య గతంలో ఆర్థిక పరమైన వివాదాలు ఉన్నాయి. 2018, 2021లో జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో వేణుమాధవ్పై కేసులు కూడా నమోదయ్యాయి. సైబరాబాద్ పరిధిలో సైతం చంద్రశేఖర్, వేణుమాధవ్ మధ్య వివాదాలు ఉన్నాయని, గతంలో చంద్రశేఖర్పై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ కూడా ప్రయోగించడం, అడ్వయిజరీ బోర్డు తిరస్కరించడం కూడా జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ వివాదాలపై పోలీసులు ఆరా తీస్తున్నారని తెలిసింది. 2018లో జరిగిన ఈ వ్యవహారంపై తాజాగా దర్యాప్తు చేపట్టడంతో పోలీసు శాఖతో పాటు, జూబ్లీహిల్స్కు చెందిన పలువురు వ్యాపారవేత్తల్లో కూడా ఆందోళన మొదలైనట్టు సమాచారం. అధికారులపై ఉన్న కోపంతో ఆరేండ్ల తర్వాత తమను రోడ్డుపైకి లాగడం సరికాదు.. అంటూ కొంతమంది వ్యాపారవేత్తలు ఏకంగా సీఎం రేవంత్రెడ్డికి సైతం మొరపెట్టుకున్నారని అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.