సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ‘ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఇన్వెస్టర్లను రప్పిస్తుంది. మార్కెట్ను పరిచయం చేస్తుంది. విశ్వ విపణికి దారి చూపుతుంది. కొత్త అవకాశాలను చేరువ చేస్తుంది. ఇందుకు మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్లో జరుగుతున్న బిజినెస్ ఉమెన్ ఎక్స్పో-2023 వేదికైంది. వంద మందికి పైగా మహిళా పారిశ్రామిక వేత్తలు తమ కంపెనీలకు సంబంధించిన వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శించి ఎందులోనూ తీసిపోమని నిరూపించారు. ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు రెండోరోజు శనివారం సందర్శకులు సైతం పెద్ద ఎత్తున రావడంతో హైటెక్స్ ప్రాంగణం అంతా సందడి నెలకొంది.’
ఆకట్టుకున్న పారిశ్రామిక ఉత్పత్తులు..
ఈనెల 10న హైటెక్స్ ఎగ్జిబిషన్లో బిజినెస్ ఉమెన్ ఎక్స్పో-2023 ప్రారంభమైంది. 12 వరకు మూడు రోజులపాటు జరుగుతున్న ఈ ఎక్స్పోలో వివిధ కంపెనీలకు చెందిన మహిళా వ్యవస్థాపకులు రూపొందించిన విభిన్న రకాల ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. ఇందుకు వందకు పైగా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. హస్త కళలు, చేనేత వస్ర్తాలు, గాజులు, ఔషధ, సుగంద, ఆయుర్వేద ఉత్పత్తులు, సేంద్రియ ఉత్పత్తులు, చిరు ధాన్యాలతో తయారు చేసిన వివిధ రకాల చిరుతిళ్లు, వంట పదార్థాలు, తిను బండారాలు, ఇంటి అలంకరణ సామగ్రి, ఆరోగ్యకర ఉత్పత్తులు, చిన్నారుల ఆట వస్తువులు, యువతులు మెచ్చే సౌందర్య సాధనాలతో స్టాల్స్ కళకళలాడాయి. వీ హబ్ సీఈవో దీప్తి రావుల శనివారం ఉమెన్ ఎక్స్పోను సందర్శించి స్టాల్స్లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించారు.
సందర్శకుల సందడి..
బిజినెస్ ఉమెన్ ఎక్స్ పోకు వివిధ కంపెనీల వ్యవస్థాపకులతోపాటు ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి సైతం పారిశ్రామిక వేత్తలు ఇక్కడకు వచ్చి తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. యువతులు సైతం వచ్చి ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించారు.
వేస్టేజ్ ఆహారంతో బయో గ్యాస్..
ఇప్పటివరకు పశువుల వ్యర్థాలతోనే బయోగ్యాస్ను తయారు చేసేవారు. అయితే హైదరాబాద్కు చెందిన మహిళా పారిశ్రామిక వేత్త శృతి అహుజా వేస్టేజ్ ఆహారంతోనూ బయోగ్యాస్ను తయారు చేసి వేస్టేజ్ అనే మాటకు చరమగీతం పాడింది. సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి బయోగ్యాస్, విద్యుత్ ఉత్పత్తిని క్షేత్రస్థాయి నుంచి ప్రోత్సహిస్తున్నది. హైదరాబాద్లో బోయినపల్లి మార్కెట్తోపాటు పలు దవాఖానలు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇప్పటికే ఈ బయోగ్యాస్ ప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆల్ ఇండియా వ్యాప్తంగానూ బయోగ్యాస్ వినియోగాన్ని పెంచేందుకు అహుజా ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమెటెడ్ కృషిచేస్తున్నది.
ఆరోగ్యానికి హాని కలిగించని ఇన్స్టంట్ ఫుడ్..
తినడానికి రుచికరంగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి హానికరం చేసేవే ఎక్కువగా మర్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్కు చెందిన లక్ష్మీ హరిత ఇన్స్టంట్ ఫుడ్ ఇండియా పేరుతో ఆరోగ్యానికి హాని కలిగించని పదార్థాలతో సహజ రుచులతో స్నాక్స్తోపాటు దోస, పొంగల్ వంటి 35 రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నది. పాలల్లో కలుపుకుని తినే ‘మిల్లెట్ మ్యాజిక్’ ప్రొడక్ట్కు కస్టమర్ల నుంచి మంచి స్పందన కూడా ఉంది. ఉత్పత్తులకు సంబంధించిన గింజ ధాన్యాలను సైతం నేరుగా రైతుల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తుండడంతో కస్టమర్లకు తమ ఉత్పత్తులపై నమ్మకం కలుగుతున్నదని లక్ష్మీ హరిత చెబుతున్నది.
ఈ కుర్చీ ఖరీదు రూ.26వేలు..
హైదరాబాద్కు చెందిన కంచన్ అనే మహిళా పారిశ్రామిక వేత్త ఉడ్తో చేసిన కళారూపాలతో ఆల్ ఇండియా వ్యాప్తంగా వ్యాపారం చేస్తున్నది. ప్రత్యేకమైన రబ్బరు పదార్థంతో తయారు చేసిన ఏనుగు బొమ్మలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. బిజినెస్ ఉమెన్ ఎక్స్పోలో ప్రదర్శనగా ఉంచిన టేకు కర్రతో చేసిన కుర్చీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని ఖరీదు రూ.28వేలని కంచన్ తెలిపింది.
ప్రత్యేక ఆకర్షణగా రాజస్థాన్ హస్తకళాకృతులు..
రాజస్థాన్ కళాకారులు రూపొందించిన కళాత్మక వస్తువులు బిజినెస్ ఉమెన్ ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇంటి అలంకరణ వస్తువులు, రకరకాల పూజా సామగ్రి, కలర్ఫుల్ చెక్క బొమ్మలు మగువలను ఆకట్టుకోవడంతో పెద్ద ఎత్తున వీటిని కొనుగోలు చేశారు.
వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే యుకా గేమ్స్..
ఈతరం పిల్లల్లో సరైన నైపుణ్యాలు పెంపొందడం లేదు. చదువు ఒత్తిడితో జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొనే చైతన్యం వారిలో ఉండడం లేదు. ఈ పరిస్థితులను దూరం చేసేందుకు యుకా గేమ్స్కు శ్రీకారం చుట్టింది హైదరాబాద్కు చెందిన మహిళా పారిశ్రామిక వేత్త రీతికా అగర్వాల్. కొత్త ఆలోచనలతో సరదాగా వ్యూహాత్మకంగా సాగేలా కొన్ని రకాల గేమ్స్ను కనిపెట్టి మార్కెట్లోకి విడుదల చేశారు. ఇది ఆన్లైన్ గేమ్లాంటిది కాదు. బుద్ది వికాసానికి, వ్యక్తిత ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుండడంతో స్టాల్స్లో ఏర్పాటు చేసిన ఈ గేమ్స్ సెట్టింగ్ను తమ పిల్లలకు కోసం చాలా మంది కొనుగోలు చేయడం కనిపించింది.