మేడ్చల్, మే 11 (నమస్తే తెలంగాణ): పల్లె దవాఖానల ద్వారా ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేలా ప్రభుత్వం పల్లె దవాఖానలపై దృష్టి సారించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 70 పల్లె దవాఖానల ద్వారా పల్లె ప్రజలందరికి ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలందిస్తున్నది. అందులో భాగంగా పల్లె దవాఖానలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 15 పల్లె దవాఖానలకు పక్కా భవన నిర్మాణాలకు రూ. 2 కోట్ల 40 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో పల్లె దవాఖాన భవన నిర్మాణానికి గాను రూ.16 లక్షలు వెచ్చిస్తున్నారు. 15 పల్లె దవాఖానల్లో నిర్మాణంలో భాగంగా ఇప్పటి వరకు 7 పల్లె దవాఖాన భవన నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు. ఇందులో ఏదులాబాద్, లాల్గడిమలక్పేట్, రావల్కోల్, డబిల్పూర్, కీసర, ఉద్దమర్రి, అలీయాబాద్లో పూర్తయ్యాయి. మరో 8 పల్లె దవాఖానల నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. త్వరలోనే నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు.
చేరువైన వైద్య సేవలు
పల్లె దవాఖానల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత విస్తరించినట్లయింది. పల్లె దవాఖానలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలను అందించనున్నారు. పల్లె దవాఖానల్లో ఎంబీబీఎస్ వైద్యుడితో పాటు ఏఎన్ఎం అందుబాటులో ఉంటారు. ఓపీ సేవలను అందించే పల్లె దవాఖానలు రోగులకు అవసరమైతే పీహెచ్సీ, యూపీహెచ్సీ, ఏరియా దవాఖానలకు రిఫర్ చేసి మరింత మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకుంటారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 70 పల్లె దవాఖానల్లో వైద్యులు, ఏఎన్ఎంల నియామకాలను పూర్తి చేయడంతో వైద్య సేవలు పల్లె ప్రజలకు అందుతున్నాయి. జిల్లాలో ఉన్న 70 పల్లె దవాఖానలకు పక్కా భవనాలు నిర్మించేందుకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలను అప్పగించినట్లయితే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారి పుట్ల శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 7 పల్లె దవాఖానలకు పక్కా భవనాలు పూర్తయినట్లు వెల్లడించారు.