మియాపూర్ : ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా 31 పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గాను తగు బడ్జెట్ను కేటాయించాలని ఆయన కోరారు.
రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం మన ఊరు మన బడి కార్యక్రమంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ అమేయ్కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ , జిల్లా చైర్ పర్సన్, సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి విప్ గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం కింద శేరిలింగంపల్లి మండల పరిధిలో 24, కూకట్పల్లి మండల పరిధిలో 7పాఠశాలల ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలు ఆంగ్ల మాద్యమ విద్యార్థులతో కిక్కిరిసిపోతున్నాయన్నారు.
ప్రభుత్వ నిధులను సద్వినియోగ పరిచి పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించడమే తన లక్ష్యమని విప్ గాంధీ స్పష్టం చేశారు. కాగా నియోజకవర్గ పాఠశాలలకు తప్పకుండా నిధులు మంజూరు చేస్తామని విద్యాశాఖ మంత్రి సబిత హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.