మొయినాబాద్, జూలై 13 : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ కుటుంబానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఇచ్చిన మాట ప్రకారం మృతుడి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి పేర్లతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించగా.. సోమవారం మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆ ముగ్గురు చిన్నారులకు ఆ డిపాజిట్ బాండ్ల ను అందించారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికేపల్లి గ్రామానికి చెందిన డప్పు కరంచంద్ బీఆర్ఎస్ పార్టీలో చురుకైన నాయకుడు.
అంకితభావంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసే సోషల్ మీడియా వారియర్. కాగా, అతడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ గత నెల 25న మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి సబితారెడ్డితో కలిసి గత నెల 28న కరంచంద్ ఇంటికెళ్లి అతడి కుటుంబీకులను పరామర్శించి..నేనున్నానంటూ మనోైస్థెర్యం కల్పించా డు. అతడి చిన్నారుల పేర్లతో వారి బంగారు భవిష్యత్తుకోసం డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని మాటిచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం 15 రోజుల వ్యవధిలోనే ఆ కుటుంబానికి ఆర్థిక చేయూతను ఇచ్చాడు.
ముగ్గురు పిల్లలు సాండ్రా లియోనా, మెల్విన్ లూయిస్, మార్టిన్ లూయిస్ల పేర్లతో రూ.2 లక్షల చొప్పున 36 నెలలపాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి.. ఆ బాండ్లను మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ద్వారా బాధిత కుటుంబానికి పంపించి పెద్ద మనసును చాటుకున్నాడు. చిన్నారులు కేసీఆర్ తాతకు, కేటీఆర్ అంకుల్కు థాంక్స్ అంటూ ఫోన్ ద్వారా చెప్పారు. మంచిగా చదువుకోవాలి బేటా అని కేటీఆర్ ఆశీర్వదించాడు. అదేవిధంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారెడ్డి వెంకట్రెడ్డి రూ.20 వేలు, సర్పంచ్ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు కోట్ల నరోత్తంరెడ్డి రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు.
పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించేందుకే..
బీఆర్ఎస్ పార్టీకి అంకితభావంతో పనిచేసిన కరంచంద్ మృతి చాలా బాధాకరమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశానుసారం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి కరంచంద్ కుటుంబాన్ని పరామర్శించగా.. అప్పుడే రామన్న ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 15 రోజుల్లోనే ప్రతి చిన్నారి పేరున రూ.2 లక్షల చొప్పున ఎఫ్డీ చేశారని తెలిపారు. చిన్నారులకు బంగారు భవితను అందించేందుకే కేటీఆర్ పెద్ద మనసుతో ఆర్థిక సాయం చేశారన్నారు. కరంచంద్ భార్య బాధ నుంచి కోలుకున్న తర్వాత ఆమెకు ప్రైవేట్ ఉద్యోగం ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నా రు.
అదేవిధంగా కరంచంద్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న బీఆర్ఎస్ నాయకులను ఆమె అభినందించారు. కాగా, మృతుడి భార్య శైలజ మాట్లాడుతూ.. పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా నన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోంపల్లి అనంతరెడ్డి, సీనియర్ నేత నర్సింహారెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి దేశమొళ్ల ఆంజనేయులు, మండలాధ్యక్షుడు దారెడ్డి వెంకట్రెడ్డి, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు కోట్ల నరోత్తంతరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శ్రీహరియాదవ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, లీగల్ సెల్ కన్వీనర్ సురేందర్గౌడ్, సీనియర్ నాయకులు రవియాదవ్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్, ప్రధానకార్యదర్శి నర్సింహాగౌడ్, మాజీ ఎంపీటీసీ మాణిక్రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ శ్యాంరావు, పరమేశ్, రాములు, శ్రీనివాస్, ప్రవీణ్, రాంచందర్, తిరుపతిరెడ్డి, దర్శన్, కుమ్మరి శ్రీనివాస్, దామోదర్రెడ్డి, కిరణ్, సునీల్, చింటూ, విజ్ఞేశ్, రవీందర్, యూసుఫ్,ప్రవీణ్గౌడ్, సాయికుమార్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.