రంగారెడ్డి, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ మెడలు వంచాలంటే ప్రజల చేతికి ఒక అంకుశం కావాలని.. అలాంటి వ్యక్తి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అనుభవం ఉన్న వ్యక్తి అని, బలహీనవర్గాల కోసం కాసాని తన జీవితాన్ని ధారబోశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కాసాని సుపరిచితుడని, జడ్పీ చైర్మన్గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజానీకానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు.
చేవెళ్ల సభ సక్సెస్ కావడంతో కాసాని విజయం ఖాయమైందని వ్యాఖ్యానించారు. కాసాని గెలుపు బీసీల అభివృద్ధికి మలుపు అని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వేదికగా కేసీఆర్ శనివారం లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఫరా ఇంజినీరింగ్ కళాశాలలోని మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. బీసీలకు దమ్ముంటే బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కాంగ్రెస్ నాయకుడొకరు సవాల్ విసిరారని, కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకుని చేవెళ్ల పార్లమెంటులోని బీసీలు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలంటే అన్ని ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేవెళ్ల ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దామని కేసీఆర్ పేర్కొన్నారు. షాబాద్, సీతారాంపురం, చందనవెల్లిలో వెల్స్పన్, కిటెక్స్, అమెజాన్ ఈస్టర్, ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ కంపెనీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశామన్నారు. వికారాబాద్, చేవెళ్ల, తాండూరు, పరిగి నియోజకవర్గాలకు సాగు నీళ్లు తెచ్చేందుకు పాలమూరు ప్రాజెక్టును చేపట్టామని చేవెళ్ల ప్రాంతానికే నీరందించేందుకు ఉద్దండాపూర్ రిజర్వాయర్ను నిర్మించామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్తో సహా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో, యావత్ తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండె..ఇప్పుడు ఎట్లున్నాయని కేసీఆర్ అన్నారు. ఉన్నట్టుండి రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న బ్రోకర్లు ఎవరు? జోకర్లు ఎవరు? అని ధ్వజమెత్తారు.
బహిరంగ సభలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, టీఎస్ఐఐసీ మాజీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాశ్గౌడ్, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు వాణీదేవి, దయానంద్ గుప్తా, యెగ్గే మల్లేశ్, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్వర్రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి, రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ రాష్ట్ర యువనేత పట్లోళ్ల కార్తిక్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త రాంబాబు యాదవ్,
జడ్పీటీసీలు పట్నం అవినాశ్రెడ్డి, కాలె శ్రీకాంత్, నీరటి తన్విరాజ్, కాలె జయమ్మ, ఎంపీపీలు గోవర్ధన్ రెడ్డి, నక్షత్ర, కాలె భవానీ, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వెంకటేశ్వర్రెడ్డి, నాగేందర్ గౌడ్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు స్వప్న, మాజీ ఎంపీపీ మంగలి బాల్రాజ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, నర్సింగ్రావు, గోపాల్, నాగిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు మిట్ట వెంకట రంగారెడ్డి, పాపారావు, నర్సింగ్ రావు, ప్రశాంత్ గౌడ్, వికారాబాద్ జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాసాని వీరేశం, కొంపల్లి అనంతరెడ్డి, దేశమళ్ల ఆంజనేయులు, కొప్పుల అనిల్రెడ్డి, మల్లారెడ్డి, మంగలి యాదగిరి, కర్నె శివప్రసాద్, పోలీస్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రంజిత్ రెడ్డి పార్టీ ఫిరాయింపుపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పుణ్యాన గెలిచిన వ్యక్తి అని..ఆయనకు ఏం తక్కువ చేశామని ప్రశ్నించారు. ఆయన ఏమైనా పొద్దు తిరుగుడు పువ్వా? అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్తారా! అని ఎద్దేవా చేశారు. అధికారం కోసమా? పదవుల కోసమా? పైరవీల కోసమా! అని ప్రశ్నించారు. ఎంపీ టికెట్ ఇచ్చి గౌరవించామని, తానే స్వయంగా వచ్చి ప్రార్థిస్తే ప్రజలు రంజిత్ రెడ్డిని గెలిపించారని కేసీఆర్ గుర్తు చేశారు.
బీజేపీ తరపున పోటీ చేస్తున్న వ్యక్తిగానీ..కాంగ్రెస్లో చేరిన వ్యక్తి ఎంపీగా గెలవక ముందు ఎవరికీ తెల్వరన్నారు. దయచేసి ఆలోచన చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది నేతలు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి జంప్ అవుతున్న నేపథ్యంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీలో అధిక ప్రాధాన్యత కల్పించిన రంజిత్ రెడ్డి పార్టీ ఫిరాయింపు పాల్పడడం సరైంది కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.