కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 3 : కూకట్పల్లి నియోజకవర్గం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు 71,387 ఓట్ల మెజార్టీతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. మాధవరం కృష్ణారావు 1,36,635 ఓట్లను సాధించి కూకట్పల్లి చరిత్రలో కొత్త రికార్డును సృష్టించారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బండి రమేశ్ 65,248 ఓట్లను సాధించి రెండో స్థానంలో నిలిచి డిపాజిట్ను దక్కించుకున్నారు.
జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ముమ్మారెడ్డి ప్రేమ్కుమార్ 39,890 ఓట్లను సాధించి మూడో స్థానంలో నిలిచినప్పటికీ డిపాజిట్ను దక్కించుకోలేకపోయారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బాశెట్టి నర్సింగరావు 1769 ఓట్లను సాధించగా బీఎస్పీ పార్టీ అభ్యర్థి బి.సంజీవరావు 1382 ఓట్లను సాధించారు. నోటాకు 2446 మంది ఓట్లేశారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, జనసేన పార్టీల నేతలు కాకుండా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన మరో 21 మంది కలిపి 9080 ఓట్లను మాత్రమే సాధించారు.
నియోజకవర్గంలో తుది ఓటరు జాబితా ప్రకారం 4,63,864 మంది ఓటర్లు ఉండగా.. పోలింగ్ రోజున 2,50,853 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 1,29,880, మహిళలు 1,20,957, ఇతరులు 16 మంది ఓటును వేశారు. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెల్లడించడంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఒక్కరే 1,36,635 ఓట్లను సాధించగా.. కాంగ్రెస్, జనసేన పార్టీల అభ్యర్థులు కలిపి 1,05,138 ఓట్లను దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
కూకట్పల్లి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా 944 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో బీఆర్ఎస్కు 359, కాంగ్రెస్కు 377, జనసేనకు 119, ఇతరులకు మిగిలిన ఓట్లను వేశారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో..
టీడీపీ అభ్యర్థిగా మాధవరం కృష్ణారావు 99,874 ఓట్లు.. బీఆర్ఎస్ అభ్యర్థి గొట్టిముక్కల పద్మారావు 56,688, కాంగ్రెస్ అభ్యర్థి 23,321 ఓట్లను సాధించారు. ఈ ఎన్నికల్లో మాధవరం కృష్ణారావు 43,186 ఓట్ల మెజార్టీతో మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో..
బీఆర్ఎస్ అభ్యర్థిగా మాధవరం కృష్ణారావు 1,11,612 ఓట్లు.. టీడీపీ నందమూరి సుహాసిని 70,562, బీఎస్పీ అభ్యర్థి పన్నాల హరీశ్రెడ్డి 12,761 ఓట్లను సాధించారు. ఈ ఎన్నికల్లో మాధవరం కృష్ణారావు పై 41,049 ఓట్ల మెజార్టీతో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో..
బీఆర్ఎస్ అభ్యర్థిగా మాధవరం కృష్ణారావు 1,36,635 ఓట్లు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేశ్ 65,248, జనసేన పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్కుమార్ 39,980 ఓట్లను సాధించారు. మాధవరం కృష్ణారావు 71,387 ఓట్లను సాధించి తిరుగులేని మెజార్టీతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రజలందరు ఆదరించడం వల్లే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించానని మాధవరం కృష్ణారావు తెలిపారు. బీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్, జనసేన పార్టీల నేతలు విశ్వప్రయత్నాలు చేసినా కులాలు, మతాలు అంటూ రెచ్చగొట్టినా ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించారన్నారు. కూకట్పల్లిలో ఆ పార్టీల నేతల కుట్రలు, ప్రలోభాలకు లొంగని ప్రజలు వారికి తగిన విధంగా బుద్ధి చెప్పారన్నారు. కులాలు, ప్రాంతాలు, మతాలకతీతంగా ప్రజలందరూ కారు గుర్తుకు ఓటేసి హ్యాట్రిక్ విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కూకట్పల్లిని మరింత అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు.