ఉస్మానియా యూనివర్సిటీ/కొండాపూర్, సెప్టెంబర్ 21: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందటం అఖిల భారతావనిలో అత్యుత్తమమైన పరిణామమని, దేశంలో మహిళలకు ఇస్తున్న గౌరవానికి ఇది నిదర్శనం అని పలువురు మహిళా విద్యావేత్తలు, ప్రొఫెసర్లు మహిళా బిల్లుపై వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు. దేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తమిళనాడులో కనిమొళి లాంటి మహిళామణుల పోరాటం వృథా కాలేదని, వారు చేసిన కృషికి కృతజ్ఞులమని ఆ విద్యావేత్తలు అన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం చరిత్రలో మర్చిపోని ఘట్టమని పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని పెంచేలా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ, ఒంటరి మహిళలకు ఆర్థికంగా చేయూత, మహిళా సాధికారతకు కృషి చేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మహిళలకు ఇబ్బందులు లేకుండా మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించి, స్థానిక ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఒక్క కేసీఆర్కే దక్కుతున్నదని విద్యావేత్తలు పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మకం
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి, లోక్సభలో ఆమోదించడం చారిత్రాత్మక విషయం. ఇదొక గొప్ప పరిణామం. నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ తమ సత్తా చూపుతున్నారు. ఉన్నత విద్య, పోటీ పరీక్షలు వంటి వాటిల్లో మహిళలే అగ్రభాగాన నిలుస్తున్నారు. ప్రతిష్టాత్మక శతాధిక వసంతాల ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు అన్ని పీజీ కోర్సుల్లో కలిసి 65 శాతం విద్యార్థినులు ఉండటమే దీనికి నిదర్శనం. మహిళలకు మరింత తోడ్పాటును అందిస్తే అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తారు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలన్న సత్ సంకల్పంతో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ, మహిళల జీవితాల్లో మార్పునకు కృషి చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సగం స్థానాలను మహిళలకే కేటాయించి, అధికారంలో వాటా కల్పిస్తున్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ రూపొందించి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు.
– ప్రొఫెసర్ సూర్యా ధనుంజయ, ఉస్మానియా యూనివర్సిటీ;
మహిళా రిజర్వేషన్ బిల్ హర్షణీయం
27 సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం జరుగుతుంది. 2023లో పార్లమెంట్లో బిల్లు పాసవ్వడం హర్షించదగిన విషయం. కుల, మత, ప్రాంతీయతత్వం భేదాలు లేకుండా అన్ని వర్గాల మహిళలకు సమాన హక్కులు కల్పించేలా ఈ బిల్లు రూపాంతరం చెందినప్పుడే అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. తెలంగాణలో కవిత, తమిళనాడులో కనిమొళి లాంటి మహిళా నాయకుల పోరాటం విజయవంతమవడం, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్ పాసవ్వడం చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది. చట్ట సభల్లో మహిళలకు సరైన అవకాశాలు కల్పించేలా అమలు చేయాలి. మేధావులు, నిపుణులు, మహిళా రాజకీయ నేతలతో చర్చించిన అనంతరం బిల్లును అమలు చేయాలి. భారతదేశంలో మహిళలు 50 శాతం ఉన్నప్పటికీ వారికి సమాన అవకాశలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలన్నింటిలోను వారికి సరైన, సమాన హక్కులు కల్పించేందుకు కృషి చేయాలి. ఓటు హక్కును ప్రవేశపెట్టిన బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో మొదటి సారిగా మహిళలు, పురుషులకు సమానమని తెలిపారు. అదే స్థాయిలో కుల, మత విభేదాలు లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి. బిల్ అమలులో జాప్యం లేకుండా వెంటనే అమలుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
– ప్రొఫెసర్ రాణిరత్నప్రభ, స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్,హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
మహిళలకు 50% రిజర్వేషన్ల ఘనత కేసీఆర్దే..
దాదాపు రెండు దశాబ్దాలకు పైగా మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్లో ఉన్నప్పటికీ, చివరికి నూతన పార్లమెంట్లో ఆమోదం పొందిన మొదటి బిల్లుగా చరిత్ర సృష్టించింది. దీంతో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో అతివలకు ఇప్పటికే సరైన ప్రాధాన్యత లభిస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అతివలకు సరైన ప్రాధాన్యతను ఇస్తోంది. ఉన్నత విద్యా రంగంలో మహిళల కోసం అనేక కళాశాలలు ప్రత్యేకంగా స్థాపించడం విశేషం. రాష్ట్రంలోనే తొలి మహిళా విశ్వవిద్యాలయం ప్రారంభించింది. స్థానిక సంస్థలతో పాటు మార్కెట్ కమిటీల్లో సైతం మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే. మహిళల ఆర్థికాభివృద్ధి కోం ప్రత్యేకంగా వీ హబ్ ప్రారంభించి, నాలుగు వేల మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామివేత్తలకు చేయూతనందించింది. వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తూ వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చర్యలు తీసుకున్నారు. ఆడబిడ్డల తాగునీటి కష్టం తీర్చేందుకు మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించి, ఇంటింటికీ నీళ్లు ఇస్తూ వారు ఆత్మగౌరవంతో బతికేలా చూస్తున్నారు.
– ప్రొఫెసర్ నిర్మలాదేవి, ఉస్మానియా యూనివర్సిటీ;
వీలైనంత త్వరగా బిల్ను అమలు చేయాలి
దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం చేయడం సంతోషకరమైన విషయం. ఈ బిల్లును వచ్చే ఎన్నికల్లో కాకుండా మరింత కాలం పాటు వేచి ఉండేలా చూడటం సరైనది కాదు. సమాజంలో రకరకాల అస్థిత్వాలున్న మహిళలున్నారు.. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని నిలబడిన వారున్నారు. వారందరిని పరిగణనలోకి తీసుకుని అందరికీ న్యాయం జరిగేలా బిల్లును రూపొందించాలి. చట్ట సభల్లో సైతం కొంత మందికే రిజర్వేషన్లు వర్తించేలా కాకుండా అందరికీ, అన్ని వర్గాల మహిళలకు న్యాయం జరిగేలా ఉండాలి. మహిళల సమస్యలు, గతంలో ఎదుర్కొన్న అభ్యంతరాలను సవరించారా? లేదా? అన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. చట్టం అమలు చేయడం హర్షించదగిన విషయమైనప్పటికీ, దాన్ని ఎలా అమలు చేస్తారన్నదే ముఖ్యమైన విషయం. రాజకీయంగా ఈ రిజర్వేషన్ను ఏ విధంగా ఉపయోగించుకుంటారన్నది. వివిధ రంగాలలో నిపుణులైన ప్రముఖులతో చర్చించిన అనంతరం అమలుకు ముందుకు సాగితే ఈ బిల్ అందరికి ఉపయోగకరంగా ఉంటుంది.
– ప్రొఫెసర్ కె.సునీతా రాణి, సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ;