Talasani Srinivas Yadav | బేగంపేట, ఏప్రిల్ 10: పేదల జోలికి వస్తే సహించేది లేదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సనత్ నగర్లోని దాసారంలో సుమారు 300 కుటుంబాలు గత 30 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. కాగా బుధవారం కొందరు వ్యక్తులు తమ ప్రాంతానికి తమ అనుచరులతో వచ్చి గుడిసెలు ఖాళీ చేయాలని హెచ్చరించారు. దీంతో ఆందోళనకు గురైన వారంతా గురువారం వెస్ట్ మారేడ్ పల్లిలోని కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎన్నో సంవత్సరాల నుండి తాము ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు తమను వెళ్లిపోవాలంటే ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.
బస్తీవాసుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్.. రెవెన్యూ, పోలీసు, జీహెచ్ఎంసీ తదితర శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. పేదల జోలికి రాకుండా, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు.