రంగారెడ్డి, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం పోరాడేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణను సాధించి హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే మరో ప్రజా ఉద్యమానికి పార్టీ శ్రేణులు సన్నద్ధులు కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో మంగళవారం కేఆర్ఎంబీ అంశంపై కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కృష్ణా ప్రాజెక్టును కేఈఆర్ఎంబీకి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సమావేశంలో తీవ్రంగా ఖండించారు. ఈనెల 13న నల్లగొండలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ప్రజా క్షేత్రంలో ఎండగట్టాలంటూ సమావేశంలో కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, చామకూర మల్లారెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్రెడ్డి, సుధీర్రెడ్డి, టి.ప్రకాశ్గౌడ్, వివేకానంద, అరెకపూడిగాంధీ, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, పైలట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేశ్రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు సత్తు వెంకటరమణారెడ్డి, రాజూగౌడ్, కార్తిక్రెడ్డి, దయాకర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పార్టీ మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.