సిటీబ్యూరో, డిసెంబర్ 3 ( నమస్తే తెలంగాణ): గ్రేటర్లో తండ్రుల చరిష్మాతో అసెంబ్లీ బరిలోకి దిగిన ముగ్గురు వారసులతో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత మాత్రమే విజయ దుందుభి మోగించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యనందిత బరిలో నిలవగా, కాంగ్రెస్ అభ్యర్థిగా దివంగత విప్లవ గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల బరిలో నిలిచారు. వీరిద్దరూ తమ తండ్రుల గుర్తింపుతోనే ప్రచారంలో విరివిగా పాల్గొన్నారు.
అయితే లాస్య నందిత కార్పొరేటర్గా కూడా రాజకీయాల్లో ఉన్నారు. తండ్రి సాయన్న హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేశారు. అదే స్థానంలో కొత్తగా గద్దర్ వారసురాలు వెన్నెల ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. రాజకీయ అనుభవం లేకున్నప్పటికీ తన తండ్రి గద్దర్ పేరుతో ఎన్నికల ప్రచారం చేసింది. అయితే ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీనే గెలిపించారు.
17వేలకు పైగా మెజార్టీతో లాస్య బీజేపీపై గెలుపొందారు. కాగా, వెన్నెల మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వెన్నెలకు 20,825 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి శ్రీగణేశ్కు 41,888 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి దివంగత మంత్రి పీజేఆర్ కూతురు విజయా రెడ్డి ఖైరతాబాద్ బరిలో ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ఆమెపై 22,010 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విజయా రెడ్డికి 45,358 ఓట్లు పోలయ్యాయి. రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.