‘కాంగ్రెస్, బీజేపీల కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలి.. మతం పేరుతో బీజేపీ నేతలు రాష్ర్టాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్నారు.. అప్రమత్తంగా ఉండాలి.. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలి’.. అని బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆత్మీయ సమ్మేళనాల ద్వారా శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. శుక్రవారం నగరంలో మూడు చోట్ల నిర్వహించగా, సోమాజిగూడలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే దానం, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్, గడ్డిఅన్నారంలో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, హఫీజ్పేటలో ఎమ్మెల్యే గాంధీ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే తలమానికంగా మారిందన్న నేతలు.. కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు, బీజేపీ మతవిద్వేషాలను ఎండగట్టారు. బీఆర్ఎస్ను ముచ్చటగా మూడోసారి గెలిపించి మరింత అభివృద్ధిని సాధించేలా శ్రేణులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఖైరతాబాద్, మార్చి 31 : మతం పేరుతో బీజేపీ నేతలు రాష్ర్టాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. సోమాజిగూడలోని జయ గార్డెన్స్ వేదికగా ఖైరతాబాద్ డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం వేడుకగా సాగింది. ఈ వేడుకలను ముఖ్య అతిథులుగా హాజరైన దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ కె. విప్లవ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆత్మీయ సమ్మేళన సభలో హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కె.ప్రసన్న సీఎం కేసీఆర్ సందేశాన్ని చదివి వినిపించారు. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ శ్రేణులందరూ ప్రభుత్వానికి బలగమని, అభివృద్ధిలో భాగస్వాములైన వారందరికీ ఆత్మీయత పంచాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపైనే ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీల కట్రలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలన్నారు. మతమనే వైరస్ను బీజేపీ ప్రజలపై వదిలిందని, ఎమ్మెల్యే రాజాసింగ్ లాంటి వారు గాడ్సే బొమ్మతో విషప్రచారానికి తెరలేపారని, దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల డిజిటల్ వార్ను సమర్థవంతంగా తిప్పికొట్టి, సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. దేశంలో 20 ఆదర్శ గ్రామాలుంటే 19 గ్రామాలు తెలంగాణకు చెందినవి కావడం గర్వకారణమన్నారు. మంత్రి కేటీఆర్ కృషితో నేడు ఐటీ రంగం ఎంతో విస్తరించిందని, దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు వెల్లువగా వస్తున్నాయన్నారు. 3లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు పెరగడం ఇందుకు నిదర్శనమన్నారు.
దేశ చరిత్రలో ప్రజల కోసం అనేక పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని, దేశంలో ఇన్ని పథకాలు ఎవరైనా తెచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు, బీజేపీ మతవిద్వేషాలను ఎండగట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరవేసేందుకు తాను వారధిగా పనిచేసేందుకు బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శోభాయాత్రలో మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్నారు. ప్రతి పక్షాలకు ఎన్నికల ముందే ప్రజలు గుర్తుకువస్తారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్, మహేందర్ బాబు, కేవీ ప్రసాద్, తాండ్ర మేఘన, కర్నాటి నాగేశ్వర్ రావు, శ్యామ్, శ్రీనివాస్ గౌడ్, జకీర్, తేజా చౌదరి, వెంకట్, రాజ్ కుమార్, కె. రామ్మూర్తి, పి.నాగరాజు, సలావుద్దీన్ పాల్గొన్నారు.