ఖైరతాబాద్, మార్చి 26: ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కుటుంబం, కులం, వారసత్వ పాలన కొనసాగిస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సీఎం రేవంత్ రెడ్డి సామాజికవర్గ ఓట్లతో అధికారంలోకి రాలేదని, 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఓట్లు వేస్తేనే వచ్చిందనే విషయాన్ని మర్చిపోయారన్నారు. తెలంగాణ ప్రజలు ఇది కోరుకోలేదని, కేవలం ఐదు శాతం ఉన్న జనాభాకు అధికారం అప్పగించలేదని, బడుగు వర్గాలకు ఏదైనా చేస్తుందని ఓట్లు వేశారని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ 15 మంది, బీఆర్ఎస్ 17 మంది, కాంగ్రెస్ పార్టీ తొమ్మిది మందిని ప్రకటించారన్నారు. ఇంకా ఎనిమిది మందిని ప్రకటించాల్సి ఉందన్నారు. అయితే, బీజేపీ 30 శాతం టికెట్లు ఇస్తే, బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసి 40 శాతానికి పైగా టికెట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. ఇక కాంగ్రెస్ తొమ్మిది మందిలో ఇద్దరికి మాత్రమే టికెట్లు కేటాయించిందన్నారు. మహబూబ్నగర్, చేవెళ్ల, మల్కాజిగిరి, నల్గొండ స్థానాల్లో రేవంత్ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికే కేటాయించారన్నారు. ఇక మాజీ మంత్రి జానారెడ్డి ఒక కొడుకు ఎమ్మెల్యే, మరో కొడుకుకు ఎంపీ స్థానం కట్టబెట్టారని, ఇది కుల, వారసత్వ రాజకీయం కాకుంటే ఇంకా ఏమనాలని ప్రశ్నించారు. ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఎస్సీ, ఎస్టీ,బీసీలు కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఈ వంద రోజుల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి తన సామాజికవర్గానికి ఎన్ని టికెట్లు, నామినేటెడ్ పదవులు, ఉద్యోగాలు ఇచ్చారో, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎంత న్యాయం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల సత్తా చూపిస్తారని స్పష్టం చేశారు. అనంతరం దివంగత బహుజన నేత, మాజీ ఎంపీ ధర్మబిక్షం చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. సమావేశంలో బీసీ సంఘాల నాయకులు కుందారం గణేశ్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్, విక్రమ్ గౌడ్, లింగం గౌడ్ పాల్గొన్నారు.