సిటీబ్యూరో, నవంబరు 11/ మేడ్చల్ (నమస్తే తెలంగాణ): శాసనసభ ఎన్నికల ఘట్టంలో నామినేషన్ల దాఖలు పోటెత్తాయి. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఏడు రోజుల్లో మొదటి ఐదు రోజులు నామమాత్రంగా నామినేషన్లు పడగా.., చివరి రెండు రోజులు పోటెత్తాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులు మొదలు, ప్రధాన పార్టీల అభ్యర్థుల వరకు నామినేషన్లు వేయగా, బీఆర్ఎస్ అభ్యర్థులు జన సంద్రం నడుమ నామినేషన్లు వేశారు. ఇందులో భాగంగానే 438 అభ్యర్థులు 650 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు.
అత్యధికంగా నాంపల్లిలో 45 మంది అభ్యర్థులు 56 సెట్లు వేశారు. జూబ్లీహిల్స్లో 40 మంది అభ్యర్థులు, 53 నామినేషన్లు వేశారు. అత్యల్పంగా బహదూర్పురలో 16 మంది అభ్యర్థులు, సికింద్రాబాద్-కంటోన్మెంట్లో 18 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాగా, అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను సోమవారం ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. ఉపసంహరణకు 15వ తేదీ వరకు అవకాశం ఉండగా.., అదే రోజు సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత వస్తుంది.