చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 1 : పోలింగ్ ముగియడంతో శుక్రవారం ఒక్కటే చర్చ ఆదివారం వెల్లవడే ఫలితాల్లో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయి.ఏ ఓటింగ్ ముగిసే సమయానికి తక్కువ పోలింగ్ నమోదు ఐనప్పటికీ 5 గంటల సమయం వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసుకునే అవకాశం కలిగించడంతో కొన్ని కేంద్రాల్లో రాత్రి వరకు కూడా ఓటింగ్ జరిగింది.ఈ సారి పాతనగరంలో యాకుత్పుర హాట్ టాఫిక్గా మారింది. అత్యల్పంగా 39 శాతం పోలింగ్ నమోదు అయింది.
బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని యాకుత్పుర బీఆర్ఎస్ అభ్యర్థి సామ సుందర్రెడ్డి దీమా వ్యక్తం చేశారు. ప్రజలపై పూర్తి విశ్వాసం ఉందని తెలంగాణలో 70 సీట్లు కైవసం చేసుకొని హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ ప్రభంజనం సృష్టిస్తారని స్పష్టం చేశారు. యాకుత్పురలో తక్కువ ఓటింగ్ కావడంపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. మజ్లిస్, ఎంబీటీ అభ్యర్థుల గొడవల కారణంగా తక్కువ పోలింగ్ కావడం, దీనికితోడు బీజేపీ అభ్యర్థి ప్రచారంలో కనిపించకపోవడంతో గులాబీ జెండాఎగురుతుందని దీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పథకాలు ప్రజల ఇంటికి చేరాయని, ఈసారి ముస్లింలు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయడానికి ఆసక్తి చూపించారని పేర్కొన్నారు. ఎగ్జిట్ ఫోల్స్ కంటే తెలంగాణ ప్రజలపై ఎక్కువ నమ్మకం ఉందని బీఆర్ఎస్ గెలిచి తీరుతుందని స్పష్టం చేశారు.
మెహిదీపట్నం, డిసెంబర్ 1 : నాంపల్లి నియోజకవర్గంలో ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండగా ఎంఐఎం తమ గెలుపుపై పూర్తి దీమాతో కనిపిస్తుంది. నాంపల్లి నియోజకవర్గంలోని మెహిదీపట్నం, ఆసిఫ్నగర్, మల్లేపల్లి, రెడ్హిల్స్, అహ్మద్నగర్, విజయ్నగర్ కాలనీ డివిజన్లకు సంబంధించిన ఓటర్లు పోలింగ్ పాల్గొని తమ హక్కును వినియోగించుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో మొత్తం 3, 32, 764 ఓట్లకు గాను 1, 51, 595 ఓట్లు పోలయ్యాయి. గురువారం అధికారులు పేర్కొన్న పోలింగ్ శాతం కాకుండా శుక్రవారం ఉదయం అధికారికంగా పోలింగ్ శాతం అధికారులు ప్రకటించారు. నాంపల్లి నియోజకవర్గంలో 45.56 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 45.10 శాతం పోలవ్వగా ఈ సారి 0 .46 శాతం పోలింగ్ పెరిగింది. గురువారం అర్ధరాత్రి వరకు పోలింగ్ కేంద్రాల నుంచి మాసాబ్ట్యాంక్లో ఉన్న జేఎన్ఎఫ్యూలో ఉన్న డీఆర్సీ సెంటర్కు ఈవీఎం మెషిన్లు చేరుకున్నాయని నాంపల్లి రిటర్నింగ్ అధికారి లావణ్యతెలిపారు. స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ,ఆదివారం ఉదయం కౌంటింగ్ ప్రారంభం అవుతుందని ఆమె చెప్పారు.
కార్వాన్, డిసెంబర్1 : సార్వత్రిక ఎన్నికల్లో గురువారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం 40.49గా నమోదయ్యింది. కారాన్ పరిధిలోని మొత్తం 316 బూత్ల నుంచి పోలింగ్ శాతం వివరాలు వచ్చే సరికి ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు. అంతిమ వివరాలు వచ్చే సరికి పోలింగ్ శాతం 48.72గా నమోదయినట్లు రిటర్నింగ్ అధికారి డి. కొమరయ్య తెలిపారు. కాగా 2018లో నమోదైన పోలింగ్ శాతం 52.68గా నమోదయ్యింది. అంటే ప్రస్తుత ఎన్నికల్లో గత ఎన్నికల కంటే 4 శాతం ఓటింగ్ తగ్గింది.
గురువారం ఎన్నికలు పూర్తి కావడంతో ఆదివారం వెలువడే ఎన్నికల ఫలితాల గురించి అన్ని పార్టీ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటింగ్ శాతం తగ్గడంతో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో అనే విషయంలో ఏ పార్టీ కూడా సరైన బేరీజు వేయలేకపోతుంది. కార్వాన్లో ఎంఐఎం బలంగా ఉండడంతో పాటు మైనార్టీ ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో పాటు ఇతర వర్గాల ప్రజల ఓట్లు కూడా తమకే వస్తాయని ఎంఐఎం నాయకులు గెలుపు తమదే అంటూ దీమా వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తమతమ గెలుపు పై దీమా వ్యక్తం చేస్తున్నారు.