జూబ్లీహిల్స్,డిసెంబర్3: అసెంబ్లీ ఎన్నికలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగిరింది. హోరాహోరీగా సాగిన పోరులో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ అప్రతిహత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆది నుంచి ఆదిక్యం కనబరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ 4,5,6 రౌండ్లలో కొంచం తడబడ్డా తదుపరి రౌండ్లలో పుంజుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి క్రికెటర్ అజారుద్దీన్, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి, ఎంఐఎం నుంచి రషీద్ ఫరాజుద్దీన్లతో పాటు వివిధ పార్టీలు, స్వతంత్రులుగా మొత్తం 19 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఆదివారం ఉదయం తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అధికారులు అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రారంభించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొదటి రౌండ్ నుంచి ఉత్కంఠ రేకెత్తించిన ఓట్ల లెక్కింపులో మాగంటి గోపీనాథ్ స్వల్ప ఆధిక్యం నుంచి చివరికి స్పష్టమైన మెజార్టీని సొంతం చేసుకున్నారు. కాగా మధ్యలో స్వల్ప అపశ్రుతి తలెత్తడంతో కౌంటింగ్ మధ్యలో నిలిచిపోయింది. కొన్ని ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఓట్ల లెక్కింపు ఆగిపోయింది.
ఈ నేపథ్యంలో 11 వ రౌండ్లో 2 ఈవీఎంలు, 12 వ రౌండ్లో మరో రెండు ఈవీఎంలు, 13 వ రౌండ్లో 1 ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తినందును ఆయా ఈవీఎం ల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో కౌంటింగ్ తాత్కాలికంగా నిలిచిపోగా జిల్లా ఉప ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి యూసుఫ్గూడలోని జూబ్లీహిల్స్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్తో పాటు సంబందిత పార్టీ ప్రతినిధులకు ఎన్నికల నిబంధనలు వివరించి కౌంటింగ్ కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో జూబ్లీహిల్స్లో నిలిచిపోయిన వీవీ ప్యాట్ల లెక్కింపును మొత్తం 26 రౌండ్లు పూర్తయ్యాక తిరిగి ప్రారంభించారు.
జూబ్లీహిల్స్లో మొత్తం 26 రౌండ్లు పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి 16,490 వేల మెజార్టీ సాధించారు. పోస్టల్ బ్యాలెట్లో 153 ఓట్ల మెజార్టీ తగ్గడంతో 16,337 ఓట్ల ఆధిక్యాన్ని అధికారులు ప్రకటించారు. మాగంటి గోపీనాథ్కు (బీఆర్ఎస్) 80,328ఓట్లు , అజారుద్దీన్ కు ( కాంగ్రెస్) 63,838 ఓట్లు, దీపక్ రెడ్డికి (బీజేపీ) 25,756 ఓట్లు, రషీద్ ఫరాజుద్దీన్కు (ఎంఐ ఎం) 7,829 ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలుపొందినట్లు ప్రకటించారు.