అసలే ఆస్తులు అమ్ముకోలేక..రిజిస్ట్రేషన్లు కాకుండా ఆవేదన చెందుతున్న 22ఏ బాధితుల నుంచి సందేట్లో సడేమియాలా అందినకాడికి దోచుకునేందుకు బ్రోకర్లు రంగంలోకి దిగారు. మేడ్చల్ జిల్లాలో 22ఏ నిషేధిత జాబితా నుంచి ప్రజల ఆస్తులను తొలగిస్తామంటూ..దందాకు తెర లేపారు. గజానికి రూ. 6 వేలు ఇస్తే నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తుల్లో తొలగించేలా చూస్తామని బ్రోకర్లు బాహాటంగా పేర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. తమ ఆస్తులను వ్యకిగత అవసరాల కోసం అమ్ముకుంటుంటే బ్రోకర్ల దందాకు తెరలేపడంతో ప్రైవేట్ ఆస్తుల యజమానులు ఆందోళన చెందుతున్నారు.
ఆస్తులు కొనుగోలుకు కూడా రుణాలు అందించేందుకు బ్యాంకు అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి వస్తున్న క్రమంలో నిషేధిత జాబితా నుంచి ఇప్పుడు ఇప్పుడే కొన్నింటిని ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్న నేపథ్యంలో బ్యాంకు అధికారులు రుణాల మంజూరీలో వేచిచూసే ధోరణిలో ఉన్నారు. దీంతో ఆస్తుల కొనుగోలుకు కొనుగోలుదారులు ముందకు రావడం లేదు. ఇప్పుడున్న పరిస్థితి చూసి బ్యాంకు రుణాలు అందించడంలో మరిన్ని నిబంధనలను పొందుపరిచే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మేడ్చల్, ఆగస్టు 27(నమస్తేతెలంగాణ) : నిషేధిత జాబితాలో ప్రభుత్వం ప్రజల ఆస్తులను చేర్చడం శాపంగా మారింది. ప్రజల ఆస్తులైన భూములు, ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లను కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిన నేపథ్యంలో ఆ జాబితాలో చేరిన ప్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనుగోలుకు వెనుకడుగు వేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లను కొన్నింటిని నిషేధిత జాబితా నుంచి తొలగించినా అడ్వాన్సులు ఇచ్చిన వారు కొనుగోలుకు ముందుకు రావడం లేదని.. ఆస్తుల యజమానులు ఆవేదన చెందుతున్నారు. నిషేధిత జాబితా నుంచి తొలిగిపోయిన ఓపెన్ ప్లాట్ల, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు విక్రయించిన వారు కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని కోరగా, అందుకు నిరాకరిస్తున్నట్లు విక్రయదారులు పేర్కొంటున్నారు.
ఇప్పుడు నిషేధిత జాబితా నుంచి తొలగించిన మళ్లీ నిషేధిత జాబితాలో చేర్చరన్న గ్యారెంటీ ఏమిటని కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు. కొనుగోలుకు అడ్వాన్స్లు ఇచ్చిన వారు తమకు తిరిగి ఆ డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారు. తమకు అత్యవసర పరిస్థితులు వచ్చినందునే తమ ఆస్తులను విక్రయించాలని చూస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చి తమ జీవితాలను కోలుకోలేని దెబ్బ తీసిందని ప్రైవేట్ ఆస్తుల యజమానులు మండిపడుతున్నారు. ఇలా అయితే తమను అదుకునేవారు ఎవరని ప్రశ్నిస్తున్నారు. కొనుగోలుదారుల వద్ద నుంచి తీసుకున్న అడ్వాన్స్లను ఎలా చెల్లించేందని అయోమయానికి గురవుతున్నారు. నిషేధిత జాబితాలో ప్రజల ఆస్తులను చేర్చిన క్రమంలో కొనుగోలు చేస్తే భవిష్యత్లో ఇబ్బందులు వస్తే ఎలా అన్న ఆందళోనలలో కొనుగోలుదారులు ఉన్నారు.