ఓ వైపు మత్తు సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు.. మరోవైపు డ్రగ్స్ బారిన పడుతున్న విద్యార్థులు, యువతను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో యాంటీ డ్రగ్స్ అబ్యూజ్ కమిటీల ఏర్పాటుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శ్రీకారం చుట్టారు. ఈ కమిటీ ప్రధానంగా కాలేజీ క్యాంపస్లోకి డ్రగ్స్ చేరకుండా కఠిన చర్యలు చేపట్టనున్నది. ఇందులో భాగంగా కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు విద్యార్థుల అలవాట్లు, క్యాంపస్ లోపల, బయట జరుగుతున్న పరిమాణాలపై ఓ కన్నేసి ఉంచనున్నారు. ఎవరైనా విద్యార్థులు డ్రగ్స్ బారిన పడితే వారికి అండగా నిలవడంతో పాటు ఆ ఊబిలో నుంచి బయటపడేసే మార్గాలను అన్వేషించనున్నారు. ఇదిలా ఉంటే సరదాగా డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టిన ఓ యువకుడు చివరికి దానికి బానిసై మృతి చెందాడు. మత్తు పదార్థాల కోసం తరచూ గోవాకు వెళ్లే అతడు వారం రోజుల క్రితం బాగానే ఉన్నా.. ఉన్నట్టుండి మృతి చెందినట్లు.. నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్న్యూ) ఏర్పాటు తర్వాత సంభవించిన ఈ మరణం హైదరాబాద్లో మొదటిదని పోలీసులు వివరించారు.
సిటీబ్యూరో, మార్చి 31 : డ్రగ్స్ విక్రేతలు సోషల్మీడియాను వాడుకుంటున్నారు. అందులో వీడియోలు చూసి..మాదకద్రవ్యాలను తయారు చేస్తున్నారు. ఏకంగా ఆన్లైన్లో మూడిపదార్థాలను తెప్పించుకుంటున్నారు. ఇంకొందరు గోవా, రుషికేశ్ వంటి ప్రాంతాలకు వెళ్లి మత్తు పదార్థాలు రూపొందించడం ఎలా అని శోధన చేస్తున్నారు. మత్తు దందాపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ నిఘాలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు నగరంలో మాదకద్రవ్యాలు దొరకకపోవడంతో కొందరు గోవా వంటి ప్రాంతాలకు వెళ్లి సరుకు తెచ్చకుంటూ.. విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఇలా ఓ యువకుడు డ్రగ్స్కు బానిసై..బలికావడం ఆందోళన కలిగిస్తున్నది. కాగా, గురువారం ఒకే రోజు పోలీసులు వేర్వేరు చోట్ల మొత్తం 12 మంది మాదకద్రవ్యాల విక్రేతలను అరెస్ట్ చేశారు.
డీడీకాలనీకి చెందిన ప్రేమ్ ఉపాధ్యాయ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ..తన స్నేహితులు, తెలిసిన వారిని మత్తుమాయలో దింపాడు. ఇతడికి లక్ష్మిపతి అనే వ్యక్తి భారీగా డ్రగ్స్ సరఫరా చేస్తుండేవాడు. ప్రేమ్ తరచూ గోవాకు వెళ్లి అక్కడ డ్రగ్స్ కొని హైదరాబాద్కు తెచ్చి విక్రయించే వాడు. ఈ క్రమంలో అశోక్నగర్కు చెందిన యువకుడు ఏకకాలంలో ఎక్కువ స్థాయిలో మత్తుపదార్థాలను వాడడంతో అతడి శరీర అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వారం రోజుల పాటు దవాఖానాలో చికిత్స పొంది..మూడు రోజుల కిందట మృతి చెందాడు. ఇదిలాఉండగా హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్న్యూ), జూబ్లీహిల్స్ పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడిలో ప్రేమ్ ఉపాధ్యాయ్తో పాటు అతడి వద్ద మత్తు పదార్థాలు కొనుగోలు చేసిన రామకృష్ణ, నిఖిల్ ఝాస్వ, జీవన్రెడ్డిలను అరెస్ట్ చేశారు. లక్ష్మిపతి పరారీలో ఉన్నాడు. ప్రేమ్ నెట్వర్క్లో సుమారు 50 మంది వరకు ఉన్నారు. వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
హెచ్న్యూ (హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్) సోషల్మీడియాపై నిఘా పెట్టింది. ఈ నిఘాలో శ్రీరామ్ అనే వ్యక్తి యూట్యూబ్లో వీడియోలు చూసి, అమెజాన్ నుంచి ముడిసరుకులు తెప్పించుకొని.. డ్రగ్స్ రూపొందిస్తున్నట్లు తేలింది. నగర అదనపు పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ కమిషనరేట్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. సూర్యాపేటకు చెందిన శ్రీరామ్ ప్రస్తుతం కొండాపూర్లో నివాసముంటున్నాడు. కాలేజీకి వెళ్తున్న సమయంలో మత్తుపదార్థాలు తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఆర్థిక సమస్యలు రావడంతో సునాయాసంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. యూట్యాబ్ తదితర సైట్లలో డ్రగ్స్ తయారు చేసే విధానాన్ని నేర్చుకున్నాడు. కొన్ని ముడిపదార్థాలను అమెజాన్, ఇండియామార్ట్తో పాటు వివిధ ల్యాబరేటరీ దుకాణాల నుంచి సమకూర్చుకున్నాడు. కొండపూర్లోని తన ఇంట్లోనే మత్తుపదార్థాలను తయారు చేస్తున్నాడు. ఒక్కో గ్రామ్ రూ. 8 వేలకు నగర పరిసరాల్లో విక్రయిస్తున్నాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నం. 36లో డ్రగ్స్ను అమ్ముతుండగా, హెచ్న్యూ అధికారులు, జూబ్లీహిల్స్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. శ్రీరామ్తో పాటు కొనేందుకు ప్రయత్నిస్తున్న సికింద్రాబాద్ బొల్లారానికి చెందిన దీపక్కుమార్ జాదవ్ సైతం దొరికాడు. నిందితుడి నుంచి 8 గ్రాముల డీఎంటీ, డ్రగ్స్ తయారు చేసేందుకు ఉపయోగించే వివిధ పరికరాలు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
గ్రాముకు నాలుగు వేలు..
సికింద్రాబాద్, మార్చి 31: హషీష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. నార్త్ జోన్ డీసీపీ చందనాదీప్తి వివరాలు వెల్లడించారు. బోయిన్పల్లి బాపూజీ నగర్కు చెందిన రమేశ్, సికింద్రాబాద్ ఇందిరానగర్ రాజీవ్ గాంధీ కాలనీ వాసి కే. సాయి ప్రకాశ్ స్నేహితులు. బోయిన్పల్లి ఏరియాలో ఉన్న తమ అనుచరులు సాయికుమార్, నవీన్ కుమార్లకు హషీష్ ఆయిల్ను గ్రాముకు నాలుగు వేల చొప్పున విక్రయిస్తుంటారు. పోలీసులు రమేశ్, సాయి ప్రకాశ్ను అదుపులోకి తీసుకున్నారు. నవీన్, సాయి పరారీలో ఉన్నారు.
సాఫ్ట్ట్వేర్ ఉద్యోగం చేస్తూ..
సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): గంజాయి విక్రయిస్తూ.. పరారీలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని హెచ్న్యూతో కలిసి బోయిన్పల్లి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నార్త్జోన్ డీసీపీ చందనాదీప్తి కథనం ప్రకారం.. నాగపూర్కు చెందిన కొండపనేని మాన్సి గంజాయికి అలవాటు పడింది. మదన్ మానేకర్తో కలిసి గంజాయి అమ్ముతున్నది. మార్చి 12న హెచ్న్యూ, బోయిన్పల్లి పోలీసులు డ్రగ్స్ విక్రేతలను పట్టుకున్నారు. ఆ సమయంలో మాన్సి పారిపోగా, గురువారం కొంపల్లిలో దొరికింది.
కేపీహెచ్బీకాలనీలో..
బాలానగర్, మార్చి 31 : కేపీహెచ్బీకాలనీలో హషీష్ ఆయిల్ను అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎన్పోర్స్మెంట్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 1208 గ్రాముల హషీష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జోన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పరుసముల దినేశ్ (26) కుదిరపాక వివేక్ సంజయ్ (25) కేపీహెచ్బీకాలనీ 7వ ఫేజ్లో ఉంటూ.. వైజాగ్లో ప్రవీణ్కుమార్ అనే వ్యక్తి వద్ద నుంచి హషీష్ ఆయిల్ను కొనుగోలు చేసి.. కూకట్పల్లి ప్రాంతంలో విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ పవన్కుమార్ ఆధ్వర్యంలో కేపీహెచ్బీకాలనీలో నిందితులను పట్టుకున్నారు.
బైండోవర్ చేసినా తీరుమారలేదు..
కుత్బుల్లాపూర్, మార్చి31: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి..మళ్లీ గంజాయి దందా చేసిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకొని రిమాండ్ చేశారు . కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ సీఐ సహదేవుడు తెలిపిన వివరాల ప్రకారం..వాజ్పేయినగర్ ప్రాంతానికి చెందిన శ్రీరాంనర్సింహాచారి 2021 ఆగస్టు 7న ఎండు గంజాయిని విక్రయించిన కేసులో ఎక్సైజ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. సత్ప్రవర్తన కలిగి సమాజంలో గౌరవంగా ఉండాలని బైండోవర్ చేశారు. కానీ..తిరిగి మార్చి 15న 120 కేజీల గంజాయితో పాటు రెండు లీటర్ల హషీష్ ఆయిల్ను సరఫరా చేస్తూ.. భువనగిరి పోలీసులకు పట్టుబడ్డాడు. భువనగిరి సబ్జైల్కు తరలించారు.