జవహర్నగర్, సెప్టెంబర్ 3: నీటి సంపులో పడి 11 నెలల బాలుడు మరణించాడు. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బీరప్పగడ్డలో హుసెనప్ప, శ్రీదేవి దంపతులు. వీరి కుమారుడు సాయిచరణ్ (11నెలలు). ప్రతి రోజు ఈ బాలుడిని ఆడించేందుకు మామ తనతో తీసుకెళ్తాడు. ఆదివారం కూడా బాలుడు కనిపించలేదు. ఈ రోజు కూడా బాలుడిని మామనే తీసుకెళ్లినట్లు తల్లి భావించింది. ఈ క్రమంలోనే మామ ఇంటికి వచ్చి బాబు ఎక్కడా.. అని అడిగి.. చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. నీటి సంపులో మృతదేహం కనిపించింది. బాలుడికి 11 నెలలు పడ్డాయని, ఈ వారంలో షిర్డీకి తీసుకెళ్లి పుట్టెంటుకలు తీద్దామనుకున్నాం.. ఇంతలోనే ఆ దేవుడే శాశ్వతంగా బాలుడిని తీసుకెళ్లడంటూ కుటుంబ సభ్యులు రోదించారు.