హయత్నగర్, సెప్టెంబర్ 14 : సైకిల్ సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. మరో బాలుడు తృటిలో తప్పించుకున్నాడు. మరణించిన బాలుడి తల్లి కూడా గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందింది. ఈ వరుస ఘటనల నేపథ్యంలో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారం, హనుమాన్నగర్కు చెందిన రావుల రిషిక్ రాంరెడ్డి(8), మూడవ తరగతి చదువుతున్నాడు. కాలనీలోని రోడ్డుపై రిషిక్ రాంరెడ్డి సైకిల్ తొక్కుతుండగా తోటి స్నేహితుడు సీహెచ్ మేఘనాథ్ వెనుకాల కూర్చున్నాడు.
అయితే చెరువు నీరు రోడ్డుపై వరకు ఉండటంతో నీటిలోనుంచి సైకిల్ వెళ్తుండగా కాలి చెప్పు స్కిడ్ అయ్యి నీటిలో పడిపోయింది. చెప్పును తీసుకునే ప్రయత్నంలో సైకిల్తో పాటు చిన్నారులు ఇద్దరూ అదుపుతప్పి చెరువులో పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు 100 డయల్ చేయగా హుటాహుటిన పోలీస్ సిబ్బంది పి.కృష్ణ, వి.మధు, కె.రాణిలు తాడు సహాయంతో బాలురిద్దరినీ బయటికి తీశారు. పరిస్థితి విషమించడంతో రిషిక్ రాంరెడ్డి మృతి చెందాడు. చెరువులో చెట్టు కొమ్మలు పట్టుకొని వేలాడుతున్న మేఘనాథ్ను ప్రాణాలతో సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. దీంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అప్పటి వరకు కండ్లముందు ఆడుకున్న మనవడు రిషిక్ రెడ్డి చెరువులో పడి మృతి చెందటంతో నానమ్మ, తాతయ్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే రిషిక్ రెడ్డి తల్లి అనారోగ్యంతో గతేడాది ఆస్ట్రేలియాలో మృతి చెందింది. అప్పటి నుంచి తండ్రి ధీరజ్ రెడ్డి కుమారుడిని తట్టిఅన్నారంలో ఉంటున్న అతడి అమ్మానాన్న వద్ద ఉంచాడు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ధీరజ్ రెడ్డి కుమారుడిని చూసేందుకు వారానికి ఒకసారి వచ్చి వెళ్తుంటాడు. కుమారుడు ఆకస్మిక మరణంతో కన్నీరుమున్నీరవుతున్నారు.